Adipurush: ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌పై.. మధ్యప్రదేశ్ సీఎం ప్రశంసలు

ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) ట్రైలర్‌ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chauhan) వీక్షించారు. ట్రైలర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

Published : 04 May 2023 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు వచ్చాక అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే టీజర్‌ వచ్చాక కాస్త ఇబ్బందికర రెస్పాన్స్‌ అందుకుంది టీమ్‌. వివిధ వర్గాల నుండి సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు సినిమా ట్రైలర్‌ను మధ్యప్రదేశ్‌ సీఎం వీక్షించి మెచ్చుకున్నారు. ఈ మేరకు సినిమా టీంను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ మే9న విడుదల చేయనున్నారని సమాచారం. తాజాగా ఈ ట్రైలర్‌ చూసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chauhan) ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూపుతుంది. ఈ సినిమాలోని పాత్రలకు నటీనటులు జీవం పోశారు’’ అని పేర్కొన్నారు. చిత్రబృందం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. 

ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జూన్‌ 16న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. గతంలో విడుదలైన టీజర్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఈసారి అలా జరగకుండా దర్శకనిర్మాతలు అత్యున్నత స్థాయిలో విజువల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈసారి ట్రైలర్‌ను 3డీలోనూ ప్రదర్శించనున్నారట. అంతేకాదు ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈనెలలోనే ప్రభాస్‌ వివిధ మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూలు  ఇస్తున్నారట.

రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఓంరౌత్‌ (Om Raut) రూపొందిస్తున్న ఈ సినిమాలో జానకి పాత్రలో కృతి సనన్‌ (Kriti Sanon) కనిపించనుంది. లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని