Maestro: ఓటీటీలో నితిన్‌ చిత్రం?

నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మ్యాస్ట్రో’ ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారట.

Published : 22 Jun 2021 21:49 IST

హైదరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరోవైపు చిత్ర పరిశ్రమలో షూటింగ్‌లు మొదలవుతున్నాయి. అయితే, ప్రస్తుతం థియేటర్లు, మల్టీపెక్స్‌లు తెరిచే పరిస్థితి మాత్రం కనపడటం లేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు రావటం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అలాంటి వాటిలో నితిన్‌ ‘మ్యాస్ట్రో’ కూడా ఉన్నట్లు తాజా టాక్‌.

నితిన్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేశ్‌, తమన్నా కథానాయికలు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’కు రీమేక్‌గా ‘మ్యాస్ట్రో’ తెరకెక్కించారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఓటీటీ ఈ విషయమై చిత్ర బృందాన్ని సంప్రదించిందట. ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చారు. మరి ‘మాస్ట్రో’ ఓటీటీలో వస్తాడో? థియేటర్‌లో వస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని