Major: నాకంత స్వార్థం లేదు.. అందుకే నాన్న బయోపిక్‌ చేయను: మహేశ్‌బాబు

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్‌ హీరోగా నటించాడు.

Published : 10 May 2022 02:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మహేశ్‌బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్‌ హీరోగా నటించాడు. శోభిత, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ‘ట్రైలర్‌ లాంచ్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు. మహేశ్‌ అతిథిగా హాజరై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వేడుకనుద్దేశించి మహేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నిన్ననే నేను ‘మేజర్‌’ సినిమా చూశా. కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సినిమాలోని ఆఖరి 30 నిమిషాల ఎపిసోడ్‌కు నా గొంతు ఎండిపోయింది. అంత భావోద్వేగంగా ఉందా ట్రాక్‌. కాసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయా. బయోపిక్‌ తెరకెక్కించడమనేది బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు చిత్ర బృందానికి నా అభినందనలు. వీరితో భాగమైనందుకు రెండేళ్లుగా నాకు థ్యాంక్స్‌ చెప్తూనే ఉన్నారు. ఇంతటి మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు ఇప్పుడు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రిస్క్‌ చేస్తున్నా అని కొందరు అనుకుంటున్నారు కానీ, నేను అసలు రిస్క్‌ తీసుకోను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌ బ్లస్టరే. ఈ సినిమా కూడా అంతే’’ అని మహేశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకే మూడు భాషల్లో..

‘‘మనందరిలానే సందీప్‌ జీవితం కూడా చాలా సాధారణంగా ఉండేది. అలాంటి ఆయన.. అసాధారణ వ్యక్తిగా ఎలా మారారన్నది ‘మేజర్‌’లో చూపించాం. సందీప్‌ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలన్నదే ఆయన పేరేంట్స్‌ కోరిక. అది ఈ చిత్రంతో నెరవేరుతుంది. మార్కెట్‌ కోసం ఈ కథను పాన్‌ ఇండియా స్థాయిలో చేస్తున్నామని చాలామంది ఊహించుకున్నారు. కానీ, మేం అందుకు చేయలేదు. సందీప్‌ ఈ దేశ ముద్దుబిడ్డ. తన మాతృభాష మలయాళం కాబట్టి అందులో డబ్‌ చేశాం, మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో తెరకెక్కించాం, ఎక్కువమందికి చేరాలన్న సంకల్పంతో హిందీలోనూ విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు మహేశ్‌ వెన్నెముకలా నిలిచారు. గుండెను హత్తకునే సంభాషణలు అందించిన అబ్బూరి రవికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని శేష్‌ పేర్కొన్నారు.

శేష్‌ గురించి ఓ పుస్తకం రాయొచ్చు

‘‘శేష్‌ 2018లో మేజర్‌ జీవితాధారంగా ఓ సినిమా చేయాలనుందన్నాడు. ఇలాంటి గొప్ప కథను ఎలా అయినా తెరకెక్కించాలని అప్పుడే ఫిక్స్‌ అయ్యా. మహేశ్‌, నమ్రత మా వెన్నంటే ఉండటం మాకు ధైర్యానిచ్చింది. శేష్‌తో ఇది నాకు రెండో సినిమా. తన గురించి ఓ పుస్తకం రాయొచ్చు. అనుకున్నది సాధించాలంటే ఎలా శ్రమించాలో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. శేష్‌తోపాటు కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్‌రాజ్‌, రేవతి నటన అందరినీ కట్టిపడేస్తుంది’’ అని దర్శకుడు శశి తెలిపారు. అనంతరం, మహేశ్‌- శేష్‌ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..

* నటుడిగా మీరు పాన్‌ ఇండియా సినిమా ప్రయత్నం చేయలేదు. నిర్మాతగా వ్యవహరించడం ఎలా ఉంది?

మహేశ్‌: అన్నింటికీ కథే సమాధానం. ఈ సినిమాకు నేను నిర్మాతనైనా ఎప్పుడో ఒకసారి సెట్స్‌కు వెళ్లేవాడిని. నమ్రతనే ఈ ప్రాజెక్టులో ఎక్కువగా ఇన్వాల్వ్‌ అయింది. సహ నిర్మాతలు అనురాగ్‌, శరత్‌ హీరోగా శేష్‌ను అనుకుంటున్నామని చెప్పగానే ఆనందించా. తను నటించిన ‘గూఢచారి’ చిత్రం నాకు బాగా ఇష్టం.

* సినిమా చూశాక, ఇందులో మీరు నటించి ఉంటే బాగుండనిపించిందా?

మహేశ్‌: లేదండీ. కొన్ని కథలు కొందరికే సెట్‌ అవుతాయి. వాటికి తగిన న్యాయం చేసేవారి దగ్గరకే అవి వెళ్తాయి. ఇలాంటి వాటిని చూసి ఆనందిస్తా తప్ప మనం చేస్తే బాగుండని ఆలోచించేంత సెల్ఫిష్‌ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి, మిగిలిన వాటిని చూసి ఎంజాయ్‌ అని అనుకుంటా అంతే.

* సల్మాన్‌ఖాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో హిందీ, మలయాళ ట్రైలర్లు విడుదల చేయించడం గురించి.. 

మహేశ్‌: ఇది అడివి శేష్‌ ఆలోచన. ఆయా ఇండస్ట్రీల సూపర్‌స్టార్లతో విడుదల చేయిస్తే మంచి సినిమా ఎక్కువ మందికి చేరుతుందనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్‌ చేశాం.

* ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి కదా!

మహేశ్‌: ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్లు ఇచ్చాయి. కానీ, మాలో ఎవరికీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనే ఆసక్తి లేదు. కొవిడ్‌/లాక్‌డౌన్‌ కారణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనీ పిక్చర్స్‌ సంస్థ మాకు అండగా నిలిచింది.

* కృష్ణ బయోపిక్‌ వచ్చే అవకాశాలున్నాయా?

మహేశ్‌: ఇంతకుముందుకు చెప్పినట్టు.. నాన్నగారి బయోపిక్‌ ఎవరైనా తీస్తే చాలా ఆనందంగా చూస్తా (నవ్వుతూ..). నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు.

* సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌ తీసేందుకు ఆయన తల్లిదండ్రులను ఎలా ఒప్పించారు?

శేష్: సందీప్‌ ఏం చేశారో చాలామందికి తెలుసు. కానీ, ఆయన ఎలా బతికారో తెలియదు. దాన్నే చూపించాలనుకున్నా. ఆయన గురించి రీసెర్చ్‌ చేసే క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఈ సినిమా చూస్తే అందరిలోనూ పాజిటివిటీ వస్తుంది. సందీప్‌ జీవితాన్ని సినిమాగా మలిచేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, సాధ్యపడలేదు. ఏడెనిమిది సార్లు వారి తల్లిదండ్రులతో చర్చించి, సినిమా తీసేందుకు అంగీకారం తీసుకున్నా.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని