MaheshBabu: బాలీవుడ్‌ వ్యాఖ్యల దుమారం... స్పందించిన మహేష్‌ టీమ్‌!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి అన్ని భాషలు సమానమేనని ఆయన టీమ్‌ స్పష్టం చేసింది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది....

Updated : 11 May 2022 15:41 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి అన్ని భాషలు సమానమేనని ఆయన టీమ్‌ స్పష్టం చేసింది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం అనంతరం ఓ జాతీయ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై మహేశ్‌ చేసిన కామెంట్స్‌ అంతటా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందిస్తూ.. బాలీవుడ్‌ తనని భరించలేదని.. అందుకే తాను అక్కడికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని.. టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో మహేశ్‌ చేసిన వ్యాఖ్యలను బీటౌన్‌ ప్రేక్షకులు తప్పుబడుతున్నారు.

కాగా, ఈ మొత్తం వ్యవహరంపై తాజాగా మహేశ్‌ టీమ్‌ స్పందించింది. మహేశ్‌ చెప్పిన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఈవిధంగా వార్తలు సృష్టించారని టీమ్ పేర్కొంది. ‘‘మహేశ్‌కి అన్నిభాషలు, సినిమాపై అమితమైన గౌరవం ఉంది. ఆయనకు అన్ని భాషలూ సమానమే. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులోనే సినిమాలు చేయడం వల్ల మిగతా పరిశ్రమలతో పోలిస్తే తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఫీలవుతున్నానని మాత్రమే ఆయన చెప్పారు. మరోవైపు, రాజమౌళితో చేయనున్న తన తదుపరి చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన చెప్పారు’’ అని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని