MAJOR: ‘మేజర్‌’ కీలక నిర్ణయం.. విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం

మేజర్‌ కీలక నిర్ణయం.. పదిరోజుల ముందుగానే షోలు

Updated : 23 May 2022 17:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి భారతీయుడ్ని భావోద్వేగానికి గురిచేసేలా అడివి శేష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా సిద్ధమైంది. శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. వాస్తవిక ఘటనలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరికొన్ని రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ‘మేజర్‌’ టీమ్‌ కీలక ప్రకటన చేసింది. దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శించనున్నట్లు తెలిపింది. దిల్లీ, జయపుర, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, ముంబయి, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు, కొచ్చిన్‌ అలా దేశంలోని 9 నగరాల్లో.. ఎంపిక చేసిన థియేటర్లలోనే ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ‘‘మేజర్‌’.. జూన్‌ 3న విడుదల కానుంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం అసాధారణమైనది. దాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఇటీవల మేము సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించినప్పుడు.. సినిమా తెరకెక్కించే సమయంలో ఏదైతే ఫీలయ్యామో మీరూ అదే భావోద్వేగాన్ని ఫీలయ్యేలా చేయాలనుకుంటున్నా.. అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను.

దానికి అనుగుణంగానే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా.. సినిమా విడుదలకు 10 రోజులు ముందుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ‘మేజర్‌’ ప్రివ్యూ వేస్తాం. ప్రముఖ ఆన్‌లైన్‌ యాప్‌ బుక్‌ మై షోతో కలిసి మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ‘బుక్‌మై షో’ యాప్‌లోకి వెళ్లి.. మీ ప్రాంతంలో ఎప్పుడు స్క్రీనింగ్‌ జరగనుందో చూసుకుని ప్రివ్యూలకు రిజిస్టర్‌ చేసుకోండి’’ అని శేష్‌ తెలిపారు. అయితే, బుక్‌ మై షో యాప్‌లో ఇంకా ‘మేజర్‌’ ప్రివ్యూలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కాలేదు. యాప్‌లోకి లాంగినై.. ‘మేజర్‌’ అని సెర్చ్‌ చేసి.. సినిమాపై ఇంట్రెస్టెడ్‌ అని క్లిక్‌ చేయగానే.. ‘‘మేజర్‌ టికెట్లు రిలీజ్‌ చేసినప్పుడు మీకు రిమైండర్‌ మెస్సేజ్‌ పంపుతాం’’ అని యాప్‌లో చూపిస్తోంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని