Malli Pelli: వేదికపై డ్యాన్స్‌ చేసిన నరేశ్‌- పవిత్ర.. ఎమోషనల్‌ స్పీచ్‌

నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్‌. రాజు తెరకెక్కించిన చిత్రం ‘మళ్లీపెళ్లి’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నరేశ్‌, పవిత్ర కలిసి డ్యాన్స్‌ చేశారు.

Published : 22 May 2023 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నటుడు నరేశ్‌(Naresh), నటి పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh) కలిసి డ్యాన్స్‌ చేశారు. తామిరువురు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీపెళ్లి’ (Malli Pelli) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రొమాంటిక్‌ స్టెప్పులతో అలరించారు. దర్శకుడు ఎం. ఎస్‌. రాజు తెరకెక్కించిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకను ఆదివారం నిర్వహించారు. 

వేడుకనుద్దేశించి నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నా చిన్నప్పుడు కృష్ణ, విజయనిర్మల గారు మేకప్‌ వేసుకుంటుంటే చూస్తూ ఉండిపోయేవాణ్ని. లైటింగ్స్‌, మేకప్‌ వాసన నాకు ఇష్టం.  తిరుపతి నుంచి బస్సుల్లో వచ్చిన వారిని చూస్తూ అమ్మవాళ్లు చేయి ఊపుతూ అభివాదం చేసేవారు. నన్ను, రమేశ్‌ని, పద్మనికి టిఫిన్‌ పెట్టించి, చెన్నైలోని పాండిబజార్‌లో సరదాగా తిప్పేవారు. అంత వరకు నా జీవితం బాగుంది. నా 9వ ఏట ‘పండంటి కాపురం’ సినిమాతో అనుకోకుండా నా ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారిగా మేకప్‌ వేసుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని అన్నారు.

నరేశ్‌ నా శక్తి: పవిత్ర

‘‘నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నా. మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రతి మనిషికీ కొన్ని కలలుంటాయి. నా విషయంలో వాటిని నెరవేర్చుకునేందుకు చిత్ర పరిశ్రమలోకి వచ్చా. నేను చేయగలిగిన పాత్రలు చేశా. నాకు కావాల్సినవి కొనుకున్నా. ఒంటరిగానే నా లైఫ్‌ని బిల్డ్‌ చేసుకున్నా. నా అనుమతి లేకుండా కొన్ని దుష్టశక్తులు దాన్ని బ్రేక్‌ చేశాయి. దానికి తగ్గట్టే నేనూ చేశా. ఇప్పుడు ఆ విషయాల్ని తలచుకుంటే ఏదోలా ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు నాకు కొంత సమయం పట్టింది. నాకు మద్దతుగా నరేశ్‌గారు నిలిచారు. ఈ శక్తి గురించి ఆ దుష్టశక్తులకు తెలియదు. మళ్లీ ఎదిగేందుకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కుటుంబంతోసహా కృష్ణగారు, మహేశ్‌బాబు అభిమానులంతా నన్ను అంగీకరించారు’’ అని ఆనందం వ్యక్తం చేశారు. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేశ్‌ మరిన్ని చిత్రాలు చేయాలని ఆమె ఆకాంక్షించారు.

‘‘నేను ఇప్పుడేం మాట్లాడను. సినిమానే మాట్లాడుతుంది. నరేశ్‌- పవిత్ర గ్రేట్‌ కపుల్‌. బోల్డ్‌ కపుల్‌ అని నేను అనను. ‘దేవి’ సినిమాలో వనిత.. తన పాత్రకు ప్రాణం పోసింది. 25 ఏళ్ల తర్వాత  ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ‘మళ్లీపెళ్లి’లోని పాత్రకూ ప్రాణం పోసింది’’ అని ఎం.ఎస్‌. రాజు తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు