Malli Pelli: ‘మళ్ళీ పెళ్లి’.. ప్రతీకారం తీర్చుకోవడానికి సినిమా చేయలేదు: నరేశ్‌

నరేశ్‌ (Naresh), పవిత్రా లోకేశ్‌ (Pavitra Lokesh) నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (malli pelli) సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలైంది.

Published : 11 May 2023 22:01 IST

హైదరాబాద్‌: నరేశ్‌ (Naresh) - పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli). ఎం.ఎస్‌.రాజు (MS Raju) దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నరేశ్‌ మాట్లాడుతూ.. తాను ఏ ఒక్కరిపైనో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సినిమా చేయలేదని చెప్పారు. 

‘‘ఎం.ఎస్‌.రాజుకి నేనొక అభిమానిని. ఆయన ఆలోచనలు యంగ్‌గా ఉంటాయి. దానికి ఉదాహరణే ‘డర్టీ హరి’ సినిమా. ‘మళ్ళీ పెళ్లి’ అనే సబ్జెట్‌ ఆయనదే. ఎంతోకాలం నుంచి ఆయన నాతో సినిమా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఓసారి ఈ కథతో నా వద్దకు వచ్చారు. కథ నచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోందని భావించాను. వెంటనే ఓకే చేశాను. మా బ్యానర్‌లో చేస్తే బాగుంటుందని భావించి దీన్ని నేనే నిర్మించాను. ఈ కథ అనుకున్నప్పుడు అమ్మ లేరు. కృష్ణగారితో ఈ కథ గురించి మాట్లాడాను. ఆయనకు ఈ కథ నచ్చింది. తప్పకుండా ఇది విజయం అందుకుంటుందని, జాగ్రత్తగా దీన్ని రూపొందించమని ఆయన చెప్పారు. అయితే, టీజర్‌, ట్రైలర్‌ చూసి ఇది నా వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించామని అనుకుంటున్నారు. ఇది ప్రపంచం మొత్తం కనెక్ట్‌ అయ్యే కథ. ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ సినిమా చేశానని కొంతమంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. రివెంజ్‌ తీర్చుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. సినిమా తీసి రివెంజ్‌ తీర్చుకునేంత డబ్బు నా వద్ద లేదు. సినిమా చూశాక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేనే బదులిస్తాను. సీక్వెల్‌ చేయమంటే తప్పకుండా చేస్తాం. నాకు ఇక్కడ ఎలా గుర్తింపు ఉందో అలాగే పవిత్రకు కన్నడలో మంచి పేరు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, కన్నడంలో విడుదల చేయాలనుకున్నా. అయితే, టీజర్‌ తర్వాత వచ్చిన స్పందనతో తమిళం, హిందీ, మలయాళంలోనూ దీన్ని డబ్బింగ్‌ చేస్తున్నాం’’ అని నరేశ్‌ వెల్లడించారు.

అనంతరం ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ..‘‘టీజర్‌, ట్రైలర్‌లో ఉన్న సన్నివేశాలను ఆధారంగా చేసుకుని తుది నిర్ణయానికి రాకండి. మా సినిమా చూడండి. నరేశ్‌ జీవితంలో జరిగిన సన్నివేశాలను ఇందులో చూపించలేదు. ఎందుకంటే అలాంటి గొడవలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. నరేశ్‌ - పవిత్రతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతోనే సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ‘మళ్ళీ పెళ్లి’తో అది సాధ్యమైంది. ఈ సినిమాలోని ఓ రోల్‌కు వనితను తీసుకోంటే బాగుంటుందనే ఆలోచన నరేశ్‌కు వచ్చింది. ఆయన చెప్పడంతోనే ఈ కథలోకి ఆమెను తీసుకున్నాం’’ అని వివరించారు.

ఇక ఇదే ప్రెస్‌మీట్‌లో పవిత్ర లోకేశ్‌ను మీరు వివాహం చేసుకున్నారా? అంటూ విలేకరి ప్రశ్నించగా.. ‘‘వివాహ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలిపోతోంది. ‘మళ్ళీపెళ్లి’ అనేది వివాహ వ్యవస్థపై గౌరవం ఉంచి చేసిన సినిమా. కొంతమంది తాళి కడతారు. కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు. ఏది ఏమైనా పెళ్లి అనేది యూనియన్‌ ఆఫ్‌ హార్ట్స్‌ అంతే’’ అని నరేశ్‌ బదులిచ్చారు. ఆయన మాటతో పక్కనే ఉన్న పవిత్ర షాకయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని