Manchu Vishnu: వెన్నెల కిషోర్‌ ఇంట్లో నోట్ల గుట్టలు.. మంచు విష్ణు క్లారిటీ

ఇటీవల తాను షేర్‌ చేసిన ఓ ఫొటో గురించి క్లారిటీ ఇచ్చారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). సరదాగానే తాను ఆ ఫొటో షేర్‌ చేశానని అన్నారు.

Published : 22 May 2023 20:35 IST

హైదరాబాద్‌: నటుడు వెన్నెల కిషోర్‌ (Vennela Kishore)ను ఉద్దేశిస్తూ ఇటీవల మంచు విష్ణు (Manchu Vishnu) షేర్‌ చేసిన ఓ సరదా ఫొటో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ‘వెన్నెల కిషోర్‌ ఇంట్లో రూ.2000 నోట్ల గుట్టలు’ అనే క్యాప్షన్‌తో పలు  కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయా వార్తలను ఉద్దేశిస్తూ మంచు విష్ణు తాజాగా ట్వీట్‌ చేశారు. వెన్నెల కిషోర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, జోక్‌గా తాను ఆ ఫొటో షేర్‌ చేశానని అన్నారు.

‘‘వెన్నెలకిషోర్‌ను ఉద్దేశిస్తూ నేను చేసిన జోక్‌.. కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌ వల్ల మరో కోణంలోకి వెళ్తోంది. నాకూ కిషోర్‌కు మధ్య ఫన్నీ ఫైట్స్‌ ఉంటాయనే విషయం చాలా మందికి తెలుసు. హ్యూమర్‌ ఉన్న వాళ్లందరూ నేను సరదాగానే ఆ ఫొటో షేర్‌ చేశానని అర్థం చేసుకున్నారు. ఎవరికైతే ఆ జోక్‌ అర్థం కాలేదో వాళ్లను ఆ భగవంతుడే కాపాడాలి’’ అని ఆయన రాసుకొచ్చారు.

ఇటీవల ఆర్‌బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న సమయంలో విష్ణు తన ట్విటర్‌ ఖాతా వేదికగా నోట్ల గుట్టల ఫొటోను షేర్‌ చేశారు. ‘‘వెన్నెల కిషోర్‌ ఇంటికి వెళ్లినప్పుడు నేను ఈ ఫొటో తీశాను. రూ.2000 నోట్లతో ఆయన ఏం చేస్తాడా?అని ఆశ్చర్యపోయాను’’ అని పేర్కొన్నారు. దీనికి వెన్నెల కిషోర్‌ సైతం సరదాగా బదులిచ్చారు. ‘‘సరిపోయింది. హీరో, విలన్‌ కొట్టుకుని కమెడియన్‌ని చంపేసినట్టు నామీద పడతారేంటి?’’ అంటూ ‘అత్తారింటికి దారేది’లో ఆహుతి ప్రసాద్‌ చెప్పిన డైలాగ్‌ను షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా, విష్ణు - వెన్నెల కిషోర్‌ మధ్య జరిగిన ఈ సంభాషణను ఆధారంగా చేసుకుని పలువురు కథనాలు ప్రచురించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు