manchu vishnu: ఆ ఆహ్వానం నాన్నకు అందకుండా చేశారు: మంచు విష్ణు

వ్యక్తిగత కారణాలతోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశానని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) అన్నారు.

Published : 16 Feb 2022 01:51 IST

విజయవాడ: వ్యక్తిగత కారణాలతోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశానని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వచ్చిన మంచు విష్ణు.. ఆయనతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘తిరుపతిలో సినిమా స్టూడియో కడతా. అందుకు ప్రభుత్వ సహకారం కోసం మళ్లీ వచ్చి కలుస్తా. శ్రీ విద్యానికేతన్‌ స్థాపించి 30ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు అది మోహన్‌బాబు యూనివర్సిటీ అయింది. అందులో పలు ఫిల్మ్‌ కోర్సులు మొదలు పెడతాం. మరొక ప్రెస్‌మీట్‌లో దాన్ని వివరిస్తా. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సినీ పరిశ్రమకు రెండు కళ్లు. విశాఖలో మాకు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో కలిసి మాట్లాడి ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా. ఇటీవల సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నాన్నగారితో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకూ ఆహ్వానం పంపారు. కానీ, ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఆ ఆహ్వానాన్ని నాన్నకు అందకుండా చేశారు. అలా ఎవరు చేశారో మాకు తెలుసు. దీనిపైనా చర్చిస్తా’’

‘‘ఇటీవల పేర్నినాని గారు ఇంటికి వచ్చి నాన్నను కలిసినప్పుడు కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేశాయి. అసలు ఆయన బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చారు. అప్పుడు నాన్న ఫోన్‌చేసి అల్పాహారం తీసుకునేందుకు ఇంటికి రమ్మని నానిగారిని ఆహ్వానించారు. ఆయన వచ్చారంతే. టికెట్‌ రేట్లతో పాటు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని అభినందిస్తూ ‘థ్యాంక్యూ’ అని ట్వీట్‌  పెట్టా. కానీ, ఆ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకుని, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. 2+2..  22 అయిపోదు. జగన్‌ అన్నతో మాట్లాడినవన్నీ వ్యక్తిగత విషయాలు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ, ఈ వేదికగా అవి చెప్పను. మంచు ఫ్యామిలీకి సపోర్ట్‌ లేకపోతే నేను ‘మా’ అధ్యక్షుడిగా గెలిచేవాడినా. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్లకు కూడా ఈ ఎన్నికలతో జవాబు చెప్పా. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. మాలో మాకు సమస్య వస్తే మేమంతా కలిసి మాట్లాడుకుంటాం. ‘మా’ ఎన్నికల్లో వచ్చిన వివాదాల వల్లే నాకు ఆహ్వానం రాలేదనడం అవాస్తవం’’ అని మంచు విష్ణు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని