Navarasa Review: నవరస రివ్యూ

Navarasa: అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేలా తీర్చిదిద్దిన ‘నవరస’ ఎలా ఉందంటే?

Updated : 10 Aug 2021 08:08 IST

వెబ్‌సిరీస్‌: నవరస; క్రియేటర్‌: మణిరత్నం; నిర్మాత: మణిరత్నం, జయేంద్ర; విడుదల: నెట్‌ఫ్లిక్స్‌

రంగస్థలం.. వెండితెర.. బుల్లితెర.. ఇలా వేదిక ఏదైనా.. కథ, కథానాలు ఎలా ఉన్నా, నటీనటులు పోషించే పాత్రలు ఏవైనా సరే పలకించే భావాలు ‘నవరసాలు’. మనిషి నిజ జీవితంలోనూ వీటిదే పాత్ర. ప్రతి జీవి వీటిలో కొన్నింటినైనా అనుభవించక, ప్రదర్శించక తప్పదు. అలాంటి ‘నవరసాలను’ ఒక్కో కథగా చెబుతూ మణిరత్నం సృష్టించిన వెబ్‌సిరీస్‌ ‘నవరస’. సూర్య, అరవింద స్వామి, సిద్ధార్థ్‌, విజయ్‌సేతుపతి ఇలా ప్రముఖ తారాగణం అంతా ఇందులో భాగం కావడంతో ఈ వెబ్‌ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ ‘నవరస’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా?

కరుణ (ఇదిరి): రేవతి, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌రాజ్, ముఖ్యపాత్రలు పోషించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. మాట్లాడదామని రేవతి ఇంటికి వచ్చిన విజయ్‌సేతుపతి ఆమె భర్తని హత్య చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో వేరే ఊరు వెళ్లిపోతాడు. ప్రకాశ్‌ రాజ్‌ ఇంట్లో తలదాచుకుంటాడు. అక్కడే క్షమాగుణం గురించి విజయ్‌ సేతుపతికి ప్రకాశ్‌ రాజ్‌ వివరిస్తాడు. అసలు ప్రకాష్ రాజ్ ఎవరు? ఏం చేసేవాడు? తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే: క్షణికావేశంలో మనుషులు ఎలాంటి పొరపాట్లు చేస్తారు? పదే పదే ఆ విషయాలు వెంటాడడం వల్ల ఎలా మదన పడిపోతుంటారు. చేసిన పనికి క్షమాపణ చెప్పడం ద్వారా, ఎదుటి వారు కూడా క్షమించడం తదితర అంశాల చుట్టూ కథ, కథనాలను నడిపాడు దర్శకుడు బిజోయ్‌. క్షమాగుణాన్ని కరుణరసంగా చూపించడం వాస్తవానికి కాస్త దూరంగా అనిపిస్తుంది. అయితే, పాత్రల తాలూకు ప్రభావం కచ్చితంగా చూసే ప్రేక్షకుడిపై ఉంటుంది. రేవతి, విజయ్‌సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు.


హాస్యం (సమ్మర్‌ 92): యోగిబాబు, నెడుముడి వేణు, రమ్య నంబీశన్‌, మణికుట్టన్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. హాస్య నటుడు తన చిన్ననాటి పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వస్తాడు. అక్కడ వేదికపై మాట్లాడుతూ.. తాను చదువుకునేటప్పుడు జరిగిన సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటాడు. అవి ఏంటి? వాటి వల్ల యోగిబాబుకు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే ‘సమ్మర్‌ 92’ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఈ ఎపిసోడ్‌కు యోగిబాబు పాత్రే హైలైట్‌. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ఆద్యంతం నవ్వులు పంచేలా ప్రియదర్శన్‌ దీన్ని తీర్చిదిద్దారు. యోగిబాబు చిన్నప్పటి పాత్ర పోషించిన నటుడు కూడా అలరించాడు. రమ్యా నంబీశన్‌ పాత్రను మొదటి నుంచి సీరియస్‌గా చూపించి, క్లైమాక్స్‌లో ఆమెతోనూ నవ్వించారు. అందరినీ ఈ ఎపిసోడ్‌ తప్పకుండా అలరిస్తుంది.


అద్భుతం (ప్రాజెక్ట్ అగ్ని): అరవింద్‌ స్వామి, ప్రసన్న కీలకపాత్రల్లో కార్తీక్‌ నరేన్‌ ఈ భాగాన్ని తెరకెక్కించారు. విష్ణు (అరవింద్‌ స్వామి) డ్రిఫ్టర్‌ అనే ఒక కొత్త పరికరాన్ని కనిపెడతాడు. దాని ద్వారా మెదడులో ఎక్కడో ఉండిపోయిన ఆలోచనలను సైతం వాస్తవంలోకి తీసుకురావచ్చు. ఆ ఆలోచనను ఇస్రోలో పనిచేస్తున్న తన స్నేహితుడు (ప్రసన్న)తో పంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘ప్రాజెక్టు అగ్ని’ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్‌. కథ, కథనాలు హాలీవుడ్‌ మూవీలను తలపిస్తాయి. 30 నిమిషాల్లో ప్రతి సీన్‌ ‘అద్భుతం’ ఆశ్చర్యం అనిపిస్తుంది. సమయం కేవలం 30 నిమిషాలకు పరిమితం కావడం వల్లే ఎపిసోడ్‌ త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ ఎపిసోడ్‌లో ఉన్నాయి. అరవింద్‌ స్వామి, ప్రసన్న నటన అల్టిమేట్‌. అయితే, ఈ పాయింట్‌ అందరికీ అర్థం కాకపోవచ్చు. క్రిస్టోఫర్‌ నోలాన్‌ వంటి దర్శకుల సినిమాలు చూసే వారు మాత్రం తప్పక ఎంజాయ్‌ చేస్తారు.


బీభత్సం (పాయసం): వసంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిసోడ్‌లో అదితి బాలన్‌, రోహిణి, ఢిల్లీ గణేశ్‌ కీలక పాత్రలు పోషించారు. 70ఏళ్ల వయసున్న సోమనాథ (ఢిల్లీ గణేశ్‌) అసూయ పరుడు. తన మేనల్లుడు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతుంటాడు. అదే సమయంలో మేనల్లుడి కుమార్తె వివాహానికి సోమనాథను పిలుస్తాడు. అహంభావి అయిన సోమనాథ ఆ పెళ్లికి వెళ్లాక అక్కడ ఏం జరిగింది?

ఎలా ఉందంటే: భావోద్వేగ ముగింపుతో తెరకెక్కిన కథలు మాదిరిగానే పాయసం ఉంటుంది. సోమనాథ పాత్రలో అసూయ పడే వ్యక్తిగా ఢిల్లీ గణేశ్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆయన కుమార్తె ఏవిధంగానైతే సోమనాథను అసహ్యించుకుంటుందో ప్రేక్షకులు కూడా ఆయన పాత్రను ఈసడించుకుంటారు. ఈ ఎపిసోడ్‌ కథలా కాకుండా చక్కటి పీరియాడిక్‌ డ్రామాలా సాగిపోతుంది.


శాంతం (శాంతం): కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో బాబీ సింహా, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రల్లో ఈ ఎపిసోడ్‌ తెరకెక్కింది. పూర్తిగా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో తమిళ రెబల్స్‌ ఇతివృత్తాన్ని దర్శకుడు ‘శాంతం’ కోసం తీసుకున్నాడు. ఒక పిల్లవాడిని కాపాడటానికి వెళ్లిన నీలవన్‌ (బాబీ సింహా)కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతను అధిగమించాడా? లేదా? తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: కార్తిక్‌ సుబ్బరాజు తమిళ ఈలమ్‌ నేపథ్యంగా ఈ కథను నడింపించే ప్రయత్నం చేశారు. భావోద్వేగాల పరంగా బాగున్నా, ‘శాంతం’ రసానికి ఈ ఎపిసోడ్‌ సార్థకత చేకూర్చలేకపోయింది. కేవలం ప్రశ్నార్థకం (?) పెట్టడం ద్వారా అసలు శాంతం ఉందా? లేదా? అన్న దానిపైనా దర్శకుడు స్పష్టత ఇవ్వలేకపోయాడు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగి ఉంటే నిడివి కారణంగా పోయి ఉండవచ్చు. అసలు అలాంటప్పుడు ‘శాంతం’ అని పెట్టడంలో అర్థం కనిపించలేదు.


రౌద్రం (రౌద్రం): నటుడిగా తనదైన ముద్రవేసి అరవింద్‌ స్వామి తొలిసారి మెగా ఫోన్‌ పట్టి దర్శకత్వం వహించారు. రిత్విక, శ్రీరామ్‌, అభిమన్యు శ్రీ కీలక పాత్రలు పోషించారు. తల్లికి జరిగిన అవమానం కారణంగా అరుళ్‌ (శ్రీరామ్‌) ఆ ప్రాంతంలోని ఒక వ్యక్తిని సుత్తితో తలపై బలంగా కొట్టి హత్య చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? అతనెలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నది కథ.

ఎలా ఉందంటే: చిన్న పాయింట్‌ను తీసుకుని, కథ, కథనాలను దర్శకుడు అరవింద్‌ స్వామి చక్కగా నడిపారు. అసలు అతని తల్లికి జరిగిన అవమానం ఏంటనేది ఈ కథలో ట్విస్ట్‌. అది తెరపైన చూడాల్సిందే. నటీనటులు కూడా ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.


భయం (ఇన్మయ్‌): సిద్ధార్థ్‌, పార్వతి, పవల్‌ నవగీతన్‌, అమ్ము అభిరామి కీలక పాత్రల్లో రతీంద్రన్ ఈ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దారు. ఓ ప్యాలెస్‌లో నివశిస్తున్న వహీదా (పార్వతి) దగ్గరకు ఫారూక్‌ (సిద్ధార్థ్‌) సంతకం కోసం వస్తాడు. వారిద్దరి మధ్య కాలీగ్రాఫీ గురించి చర్చ జరుగుతుంది. అప్పుడే వహీదా గతాన్ని ఫారూక్‌ చెప్పటం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె భయానికి గల కారణమేమిటి? ఫారూక్ ఎవరు? తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: రతీంద్రన్‌ ‘భయం’ అనే రసానికి న్యాయం చేశారు. తర్వాత ఏం జరుగుతుందన్నది తెలుస్తున్నా, ప్రేక్షకుడిని ఆసక్తిని కలిగించడంలో విజయం సాధించారు. అయితే, ఇంకాస్త భయంగా, ఉత్కంఠతో తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. వహీదా, ఫారూక్‌ పాత్రల్లో పార్వతి, సిద్ధార్థ్‌ ఒదిగిపోయారు. ఈ ఎపిసోడ్‌ కూడా ఉన్నంతలో బాగానే అలరిస్తుంది.


వీరం (తునిత్తాపిన్‌): సర్జున్‌ కె.ఎం. దర్శకత్వంలో అధర్వ, అంజలి, కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. వీర (అథర్వ) గ్రేహౌండ్స్‌ ఇన్‌స్పెక్టర్‌. కూంబింగ్‌లో ఒక నక్సలైట్‌ (కిషోర్‌)ను పట్టుకుంటాడు. ఈ ఆపరేషన్‌లో ఇతర పోలీసులు చనిపోవడంతో నక్సలైట్‌ను తీసుకుని ఒక్కడే జీపులో సిటీకి రావాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? వీర తన వీరత్వాన్ని ఎలా చూపించాడనేది ఈ కథ.

ఎలా ఉందంటే: మణిరత్నం ఈ కథను రాశారు. సర్జున్‌ కె.ఎం. ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించిన విధానం బాగుంది. అధర్వ, కిషోర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. అయితే, వీరత్వం మాత్రం ఆశించినంత లేదు. ఇంకాస్త ఉత్కంఠగా సన్నివేశాలు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.


శృంగారం (గిటార్‌ కంబి మేలే నింద్రు): కమల్‌ (సూర్య) గామీ అవార్డు నామిని. లండన్‌లోని ఒక కేఫ్‌లో ప్రదర్శన ఇస్తుంటాడు. తన ప్రేయసి నేత్ర (ప్రగ్యా మార్టిన్‌)ను ఎలా కలుసుకున్నాడు? వారిద్దరి మధ్య ఏం జరిగిందని చెబుతుంటూ ఉంటాడు.

ఎలా ఉందంటే: గౌతమ్‌ మేనన్‌ ఈ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. గతంలో గౌతమ్‌ తెరకెక్కించిన చిత్రాలన్నింటినీ ఒక మిక్సీలో వేసి, బాగా పిండితే వచ్చిన దాంతోనే ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించినట్లు ఇట్టే అర్థమైపోతుంది. సూర్య కీలక పాత్రలో చేశారని ఆశించి చూస్తే, నిరాశే ఎదురవుతుంది. తొలిచూపు వలపులు, ప్రేమ గిలిగింతలు, పాటలు మేళవించి గౌతమ్‌ దీన్ని వండి వర్చారు. పాటలు బాగున్నాయి. ఉన్న ఎపిసోడ్‌లు అన్నింటికీలోకి దీని నిడివే కాస్త ఎక్కువ. యువతను ఈ ఎపిసోడ్‌ బాగానే కనెక్ట్‌ అవుతుంది. రెగ్యులర్‌ ప్రేమకథకు గౌతమ్‌ తనదైన షుగర్‌ కోటింగ్‌ ఇచ్చారంతే! ఒకట్రెండు మెరుపు సన్నివేశాలు ఉంటే ఇంకాస్త బాగుండేది.

‘నవరస’ సాంకేతికంగా..: సాంకేతికంగా ‘నవరస’ చక్కగా ఉంది. ఈ వెబ్‌సిరీస్‌ కోసం పని చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు తమవంతు పాత్ర పోషించారు. ఎవరి ఎపిసోడ్‌కు వాళ్లు న్యాయం చేశారు. అయితే, ప్రతి ఎపిసోడ్‌ 30 నిమిషాలకు కాస్త అటూఇటూగా ఉండటంతో కొన్ని ఎపిసోడ్‌లు చూస్తున్నప్పుడు ఇంకాస్త ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇంకొన్ని ఎపిసోడ్‌లు సినిమాకు సరిపోయే కథ, కథనాలను కలిగి ఉన్నాయి. ఏదేమైనా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌతిండియాకు తమవంతు సాయం చేయడానికి నటీనటులు, సాంకేతిక బృందం ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా పనిచేశారు. సినిమా వాళ్లను ఆదుకునేందుకు అందరూ ఒకతాటిపైకి రావడం అభినందనీయం.

చివరిగా: ‘నవరసాలు’ కొన్ని మాత్రమే పండాయి.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని