OTT తర్వాత థియేటర్‌లోకి.. ఇలా జరగడం ఇదే తొలిసారి

మనోజ్‌ బాజ్‌పేయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో నటించిన ‘బందా’ (Bandaa) చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఓటీటీ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టిన తొలి చిత్రంగా ఖ్యాతి సొంతం చేసుకుంది.

Published : 02 Jun 2023 20:37 IST

ముంబయి: ఇప్పుడున్న రోజుల్లో సినిమా ఏదైనా సరే థియేటర్‌లో విడుదలై ఆ తర్వాత ఓటీటీలోకి రావడం.. లేదంటే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే, దీనికి కాస్త భిన్నంగా ఓటీటీ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టి తాజాగా ఓ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? ఓటీటీ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టడానికి కారణమేమిటి?

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai). కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. గత నెల 23న జీ5 ఓటీటీ వేదికగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనోజ్‌ నటనకు అంతటా మంచి మార్కులు పడ్డాయి. సినిమా చాలా బాగుందంటూ సినీ ప్రియులు సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓ వైపు ఓటీటీలో ఇది ప్రసారమవుతున్నప్పటికీ థియేటర్‌లోనూ విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యింది. అలా ముంబయిలోని బోరివాలి, బాంద్రా, డోంబివిలి ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో ‘బందా’ చిత్రాన్ని నేటి నుంచి సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఓటీటీలో విడుదలైన 10 రోజుల్లోనే థియేటర్‌లోకి వచ్చిన మొదటి చిత్రంగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గతంలో ‘కలర్‌ఫొటో’ సైతం ఓటీటీ నుంచే థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పటికీ అది కొన్ని నెలల వ్యవధి తర్వాత జరిగింది.

ఇంతకీ ‘బందా’కి ఎందుకంత క్రేజ్‌..

సమాజంలో కొంతమంది దేవుడిగా కొలిచే ఒక బాబా (సూర్య మోహన్‌) తనిని వేధించాడంటూ ను (అద్రిజ) అనే యువతి పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ యువతి మాటలు నమ్మని సమాజం ఆమెకు వ్యతిరేకంగా మారుతుంది. ను బాధను అర్థం చేసుకున్న సోలంకి (మనోజ్‌ బాజ్‌పాయ్‌) అనే న్యాయవాది ఆమెకు ఆశ్రయమిచ్చి.. కేసు టేకప్‌ చేస్తాడు. ఆ బాబా మాయలోపడి ఎంతోమంది యువతులు వేధింపులకు గురి అవుతున్నారని తెలుసుకున్న సోలంకి.. సుమారు ఐదేళ్లపాటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తాడు. మరి, సోలంకి కోర్టులో విజయం సాధించాడా? యువతులను ఇబ్బందిపెట్టిన బాబాకు శిక్ష పడిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ‘బందా’ ట్రైలర్‌ విడుదలైన వెంటనే దేశంలోని ఓ ప్రముఖ ఆశ్రమం చిత్ర నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపించింది. ఈ వివాదంతో ప్రేక్షకుల దృష్టి ‘బందా’పై పడింది. అలా గత నెల జీ5 వేదికగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ 200 మిలియన్లకు పైగా వాచ్‌ మినిట్స్‌తో మంచి హిట్‌ అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని