కామెడీ, లవ్‌, స్పోర్ట్స్‌, ఫ్యామిలీ.. అన్నీ ఒకే నెలలో

ఓవైపు స్పోర్ట్స్‌ డ్రామాలు, ప్రేమకథా చిత్రాలు.. మరోవైపు ఫుల్‌లెంగ్త్‌ కామెడీ‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌.. ఇలా మార్చిలో అన్ని రకాల జోనర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి....

Published : 31 Mar 2021 11:50 IST

మార్చిలో మెప్పించిన పసందైన చిత్రాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు స్పోర్ట్స్‌ డ్రామాలు, ప్రేమకథా చిత్రాలు.. మరోవైపు ఫుల్‌లెంగ్త్‌ కామెడీ‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌.. ఇలా మార్చిలో అన్ని రకాల జోనర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం కలెక్షన్ల‌ వర్షం కురిపించలేకపోయాయి. ‘జాతిరత్నాలు’ అత్యధికంగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకోగా.. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గాలిసంపత్‌’, ‘చావు కబురు చల్లగా’, ‘శశి’ పర్వాలేదనిపించాయి. అలా, ఈ నెలలో విడుదలైన చిత్రాలు.. వాటి ఫలితాలపై ఓ లుక్కేయండి..!

 ఏ1 ఎక్స్‌ప్రెస్‌..! 

మన జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో మొదటిసారి తెలుగులో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి నటీనటులు. డేనియస్‌ జీవన్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల మొదటి వారంలో ఎక్స్‌ప్రెస్‌లా థియేటర్‌లోకి దూసుకువచ్చిన ఈ చిత్రం చివరికి ఆర్డనరీ టాక్‌కు మాత్రమే పరిమితమైంది.

రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్


పవర్‌ ప్లే..!

‘ఒరేయ్‌ బుజ్జిగా’ లాంటి వినోదాత్మక సినిమా తర్వాత రాజ్‌ తరుణ్‌, విజయ్‌ కుమార్‌కొండా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పవర్‌ ప్లే’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రచారచిత్రాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. అలా, ఎన్నో అంచనాల నడుమ మార్చి 5న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.

రివ్యూ: పవర్‌ ప్లే


గాలి సంపత్‌..!

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రలో నటించిన ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘గాలిసంపత్‌’. శ్రీవిష్ణు కథానాయకుడు. అనీశ్‌ కృష్ణ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో విడుదలకు ముందే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను చక్కగా చూపించిన ‘గాలిసంపత్‌’ వెండితెరపై ఓ మోస్తరుగా రాణించింది.

రివ్యూ: గాలి సంపత్‌


శ్రీకారం..!

వ్యవసాయం, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కథాంశాలుగా చేసుకుని తెలుగులో ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. అలాంటి కథతోనే ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. బి.కిషోర్‌ దర్శకుడు. శర్వానంద్‌, ప్రియా అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ఇందులో రావురమేష్‌, సాయికుమార్‌, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. ‘శ్రీకారం’ చక్కని ప్రయత్నమే అయినప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉండడంతో మిశ్రమ స్పందనలకే ఇది పరిమితమైంది.

రివ్యూ: శ్రీకారం


జాతిరత్నాలు..!

జోగిపేట కుర్రాళ్లుగా వెండితెరపై నవ్వుల సునామీ సృష్టించారు న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ. ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. కె.వి.అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక.

రివ్యూ: జాతిరత్నాలు


మోసగాళ్లు..!

నిజ జీవితంలో జరిగిన ఓ భారీ స్కామ్‌ను ఆధారంగా చేసుకుని తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు, కాజల్‌, నవదీప్‌, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ ఐటీ కుంభకోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా అభిమానులని ఆకర్షించింది.

రివ్యూ: మోసగాళ్లు


చావు కబురు చల్లగా..!

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగ‌ళ్లపాటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ విభిన్నమైన లుక్‌లో బస్తీబాలరాజుగా ఆకర్షించారు. ఆమని, మురళీశర్మ కీలకపాత్రలు పోషించారు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

రివ్యూ: చావు కబురు చల్లగా


శశి

‘ఒకే ఒక లోకం నువ్వే..’ అనే పాటతో విడుదలకు ముందే ప్రేక్షకాదరణ మెండుగా పొందిన చిత్రం ‘శశి’. ఆది, సురభి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించారు. వెండితెరపై వెలుగులకు ఇది నోచుకోలేకపోయింది.

రివ్యూ: శశి

ఇవి మాత్రమే కాకుండా ఇటీవల విడుదలైన ‘అరణ్య’, ‘రంగ్ దే’, ‘తెల్లవారితే గురువారం’ సినిమాలు పాజిటివ్‌ టాక్‌ అందుకుని వెండితెరపై విజయవంతంగా రాణిస్తున్నాయి. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడడానికి ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని