Chiranjeevi: నా ఒక్కడి కోసమే కాదు కదా?

‘‘తొలిసారి కథ వినగానే బాగుందని చెప్పి, చేసిన ప్రతీ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. కథ వినేటప్పుడు కామెడీ సన్నివేశాలు ఎన్నొస్తాయి? ఫైట్లు ఎన్నుంటాయి? ఎంత గ్లామర్‌ ఉంటుందనేది చూడను.

Updated : 24 Apr 2022 06:56 IST

చిరంజీవి... ఇది ఓ వ్యక్తి పేరు మాత్రమే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు కీర్తి. సినిమాల్లో ఇప్పుడు పనిచేస్తున్న వారికి, ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వారికి ఓ స్ఫూర్తి.  నటుడిగా కెరీర్‌ ప్రారంభించి నాలుగు దశాబ్దాలు పైనే అవుతున్నా... ఆయనలో జోరు, నటనలో హుషారు ఇంతైనా తగ్గలేదు. ఇప్పటికీ నవతరంతో పోటీ పడుతూ మరింత ఉత్సాహంగా సాగుతున్నారు. తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఇటీవల ‘ఆచార్య’ చేశారు చిరంజీవి. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

నిర్మాణ దశలో ‘ఆచార్య’కి వచ్చిన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగమించారు?

అన్నిటికీ వచ్చినట్టుగానే మా సినిమాకీ కరోనా పాజిటివ్‌ వచ్చింది (నవ్వుతూ). అయినా మేం ఎక్కడా తొణకలేదు. సహనం, సంయమనంతో వ్యవహరించాం కాబట్టి మరింత ఉత్సాహంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉండటంతోనూ మాకు కొంచెం జాప్యం జరిగింది. మరి రామ్‌చరణ్‌ కోసమే ఎందుకు ఎదురు చూడాలి? మరో యువ కథానాయకుడిని తీసుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు రావచ్చు. చరణ్‌ లేకపోతే ఈ సినిమా లేదన్నారు దర్శకుడు కొరటాల శివ. నిజంగానే చరణ్‌, చిరంజీవి కోసమే డిజైన్‌ చేసిన కథ ఇది. తెరపై మా పాత్రల మధ్య ఎలాంటి బంధం ఉండదు, కానీ ప్రేక్షకులు ఫీల్‌ అవుతారు. అదే ఇక్కడ ప్రత్యేకత.  

ఈ ప్రాజెక్టుకు బీజం ఎలా పడింది?

కొరటాల శివను అతని తొలి సినిమా నుంచీ చూస్తూ వచ్చాను. రచయితగా ‘అన్నయ్య’ సినిమా నుంచి ఉన్నానని ఈమధ్య తను చెబితేనే నాకు తెలిసింది. నేను రాజకీయాల్లోకి వెళ్లి పరిశ్రమకి దూరంగా ఉన్న సమయంలో ఆయన దర్శకుడిగా తనదైన ప్రావీణ్యం ప్రదర్శిస్తూ విజయవంతంగా ఎదిగారు. నేను తిరిగి రావాలనుకున్నప్పుడు కొరటాలలాంటి దర్శకుడితో కాంబినేషన్‌ కుదిరితే నా పునః ప్రవేశం బాగుంటుందని అనేవాణ్ని. అయితే రామ్‌చరణ్‌ -  కొరటాల కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ‘మీతో నేనెప్పుడైనా సినిమా చేసుకుంటా, మొదట డాడీతోనే చేస్తాన’న్నారు కొరటాల. తర్వాత కొద్ది రోజుల్లోనే ఓ కథతో వచ్చారు. మీరూ, చరణ్‌ ఇద్దరూ కలిసి చేయాల్సిన కథ ఇదని చెప్పారు. అలా మా కలయికలో ‘ఆచార్య’ కుదిరింది.

రామ్‌చరణ్‌ని చిన్నప్పుడు సరదాగా సెట్‌కి తీసుకెళ్లడం దగ్గర్నుంచి... సహ నటుడిగా సెట్‌ని పంచుకోవడం వరకూ.. ఆ అనుభూతులేంటి?

మద్రాస్‌లో ఉన్నప్పుడు సెట్‌కి ఆట విడుపుగానే వచ్చేవాడు చరణ్‌. తను పదిహేనేళ్ల కుర్రాడు అయ్యేవరకు సినిమా ప్రభావం ఎంత? నేను ఏ స్థాయి నటుడినో తెలియదు. సినిమామీద ఆసక్తి. నటించాలనే కోరిక ఏమాత్రం ఉండేవి కావు. హైదరాబాద్‌కి వచ్చాక, కాలేజీలో చేరాక మన సినిమా పరిధితోపాటు, మన సంస్కృతిలో అదొక భాగం అని తనకి తెలిసొచ్చాయి. ఈ రంగంలో రాణించడం దేవుడిచ్చిన వరం అని తను తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆసక్తి ఏర్పడిందో, ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముంబయిలో మూడు నెలలు తప్ప తను పెద్దగా తర్ఫీదు పొందలేదు. కష్టేఫలి అని నేను నమ్మినట్టుగానే తనూ ఆచరిస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి చెప్పినట్టుగా తను మనసులో ఏదీ పెట్టుకోకుండా ఓ తెల్లకాగితంలానే సెట్‌కి వస్తాడు. ఎంతైనా కష్టపడతాడు.

యువతరం దర్శకులతో కలిసి పనిచేయడంపై మీరు ఆసక్తి చూపుతున్నారు. వ్యూహంలో భాగమే అనుకోవచ్చా?

యువతరం కొత్త ఆలోచనలతో వస్తున్నారు. దాంతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తోంది. వాళ్లకి నేను ఉపయోగపడుతూ, వాళ్లని నేను ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నా. నా వింటేజ్‌ లుక్‌, నా   ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని యువతరం దర్శకులు సినిమాల్ని రూపొందిస్తున్నారు. వాళ్ల ఆలోచనలకి, ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం తోడైందంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక నుంచి వరుసగా రానున్న నా సినిమాలే చెబుతాయి.

ఒకేసారి ఐదు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపి, అందులో నాలుగు చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి అన్ని చిత్రాల్లో చేయడం ఎలా సాధ్యమవుతోంది?

ఇంకో విషయం చెప్పనా! ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి(నవ్వుతూ). మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే ఈ రంగంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఎంత సంతోషిస్తామో ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధపడతాం. నిలబెట్టుకోవాలంటే నిరంతరం ఇదే రకంగా పని చేయాలి. 24 గంటలు చిత్రీకరణ అన్నా నాకు విసుగు రాదు. ‘గాడ్‌ఫాదర్‌’ కోసం రాత్రిళ్లు షూటింగ్‌ చేశాం. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాత్రిళ్లే పనిచేశాం. ఎక్కడా విసుగు లేకపోగా మరింత ఉత్సాహం కలుగుతోంది. నా కష్టమే నన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. నేను కష్టపడేంతవరకు ఈ పరిశ్రమ నన్నెప్పుడూ అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్ముతాను.

‘పరిశ్రమ పెద్ద’ అనే స్థానంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. మిమ్మల్ని పరిశ్రమ పెద్దగానే గౌరవిస్తానని రాజమౌళి అన్నారు. ఆ  విషయంలో మీ అభిప్రాయమేమిటి?  

పరిశ్రమ ఎప్పుడూ ఒక తాటి మీద నడవాలంటే అందుకు తగిన ఓ బలమైన తాడు కావాలి. ఈ తాడు ఒక్కళ్లు అనుకోవడం సరైంది కాదు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పనిచేయాలి. కరోనా సమయంలో పరిశ్రమ స్తంభించిపోతే, నేను కేంద్రంగా ఉంటూ కొంతమంది పెద్దలతోనూ, పదిమంది హీరోలతో మాట్లాడి ‘కష్టకాలం వచ్చింది, ఇలా చేద్దాం, ఇదిగో నేనింత ఇస్తున్నా’ అనగానే అందరూ ముందుకొచ్చి తలో చేయి వేశారు. అవన్నీ కలిపి నాలుగు నెలలపాటు చాలా మంది ఇళ్లలో కష్టం లేకుండా చేశాం. ఇక్కడ పెద్ద మనిషి అనేది ఒక్కరికి ఆపాదించేది కాదనేది నా అభిప్రాయం.

పరిశ్రమ సమస్యల్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి దగ్గర మీరు చేతులు జోడించడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? అవి మీ దృష్టికి వచ్చాయా?  

నా బాధ్యతగా భావించే నేను ప్రభుత్వాల అధినేతల దగ్గరికి వెళ్లా. కోట్లు పెట్టి సినిమాలు తీసిన అగ్ర నిర్మాతలంతా అగమ్యగోచరంగా అలా చూస్తూ కూర్చుండిపోయారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలతో నాకున్న పరిచయాలతో నేను వాళ్ల దృష్టికి పరిశ్రమ సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నా. పరిశ్రమ మనుగడకి సంబంధించిన సమస్య అది. అందుకే చేతులు జోడించి వివరించా. దాన్ని పట్టుకుని ఒకొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు. అవన్నీ నేను విన్నా. నా ఒక్కడి కోసమే అలా చేస్తే అందరూ అన్నట్టుగా ఆ రోజు నేను తలొంచి సిగ్గుపడతా. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన పరిశ్రమ సమస్యని పరిష్కరించడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఓ అవకాశం అనుకుంటా. 

తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌పై మీ అభిప్రాయం ఏమిటి?  

ఉత్తమోత్తమైన పరిణామం ఇది. ఒకప్పుడు ప్రాంతీయ పరిశ్రమగానే మనల్ని చూసేవాళ్లు. చెప్పాలంటే తెలుగుకి సరైన గుర్తింపే లేదు. ఆ దశ నుంచి ఇప్పుడు పాన్‌ ఇండియా     సినిమాల్ని తీయడం, విశ్వవ్యాప్తంగా మన ప్రేక్షకులకి చేరువ చేయడం ఓ గొప్ప పరిణామం. 1988లో ‘రుద్రవీణ’ సినిమాకి జాతీయ పురస్కారం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడం కోసం నేను, నాగబాబు దిల్లీ వెళ్లాం. అక్కడ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. భారతీయ సినిమా చరిత్ర అని బ్యానర్లు పెట్టి, కొద్దిమంది నటులు, వాళ్ల ఫొటోలు, వివరాల్ని ప్రదర్శించారు. అక్కడంతా హిందీ నటుల ఫొటోలే తప్ప, దేవుళ్లలాంటి మన నటులు ఎన్టీఆర్‌,    ఏఎన్నార్‌ ఫొటోలు లేవు. జెమినీ గణేశన్‌, రాజ్‌కుమార్‌ల చిత్రాలూ లేవు. దక్షిణాదికి అస్సలు గుర్తింపు లేదని అప్పట్లోనే నేను బయటికొచ్చి మాట్లాడా. అలా బాధపడిన క్షణాల నుంచి, ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో మన  సినిమా సత్తా    చాటుతుండడం చూస్తుంటే ఎంతో తృప్తి కలుగుతోంది. దీనికి ‘శంకరాభరణం’తో కె.విశ్వనాథ్‌ ఆద్యులు అయితే, దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ వైభవాన్ని శంకర్‌, ‘బాహుబలి’తో రాజమౌళి తీసుకొచ్చారు. ప్రశాంత్‌నీల్‌, సుకుమార్‌, కొరటాల శివ... వీళ్లంతా ఆ దారిలోనే ప్రయాణం చేస్తారు. హాలీవుడ్‌ మనకంటే ఇరవయ్యేళ్లు ముందుండేది. ఇప్పుడు మనకీ వాళ్లకీ అంతరం బాగా తగ్గిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాలతోనే మన సినిమాలు రూపొందుతున్నాయి. ఈ విషయంలో మనందరం గర్వపడాలి.

మీ చిత్రాల్లో బలమైన సామాజికాంశాలు ఉంటాయి. అవి మీకు బలమా? భారమా?

బలమైన సామాజిక సందేశాన్ని గుండెలకి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పిన ప్రతీ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. హాస్య సన్నివేశాలు, గ్లామర్‌, ఫైట్స్‌... ఇవన్నీ అప్పటికప్పుడు  అలరించే అంశాలే. మనసులో సుదీర్ఘకాలం ఉండిపోయేవి కథాంశం, భావోద్వేగాలే. అలాంటి కథల్ని చేయడానికే నేను ఇష్టపడతా. అలాంటివి చేయడం కచ్చితంగా నా బలం.


‘‘తొలిసారి కథ వినగానే బాగుందని చెప్పి, చేసిన ప్రతీ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. కథ వినేటప్పుడు కామెడీ సన్నివేశాలు ఎన్నొస్తాయి? ఫైట్లు ఎన్నుంటాయి? ఎంత గ్లామర్‌ ఉంటుందనేది చూడను. నా మెదడుకి ఏది తాకుతుందో దాన్ని పట్టించుకోను. హృదయానికి ఏదైతే తాకుతుందో అదే నాకు ముఖ్యం.  అందుకని దర్శకులు కథ చెబుతామంటే నేను వింటానని కాకుండా, చూస్తానని చెబుతా. కథ అందరం వింటాం కానీ, నాకు మాత్రం కథ చెప్పేటప్పుడు దాదాపుగా ఫస్ట్‌ కాపీ చూసినట్టుగా అనిపిస్తుంది. అందులో తప్పొప్పులు ఇట్టే తెలిసిపోతుంటాయి. ఏది హృదయాల్ని టచ్‌ చేస్తుందో, ఏది కళ్లు చెమర్చేలా ఉంటుందో అర్థమవుతుంది.’’  

‘‘దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు నా హృదయానికి హత్తుకుంది. కంటనీరు రాకపోయినా, హృద్యమైన అనుభూతి చెందకుండా ఏ ప్రేక్షకుడూ థియేటర్‌ నుంచి బయటికి రాడు.’’


‘ఆచార్య’ వేడుక

‘ఆచార్య’ విడుదల ముందస్తు వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివ, పూజా హెగ్డేతో పాటు దర్శకులు మోహన్‌ రాజా, మెహర్‌ రమేష్‌, బాబీ, నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, డివివి దానయ్య, ఎన్వీ ప్రసాద్‌, వై.రవిశంకర్‌, కె.ఎస్‌.రామారావు, అన్వేష్‌, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ - లక్ష్మణ్‌, ఛాయాగ్రాహకుడు తిరు, కళా దర్శకుడు సురేష్‌, సురేఖ, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి అని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజమౌళిని సత్కరించారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని