Mohan Babu: విష్ణు అలా అనగానే షాక్‌ అయ్యా.. పెద్దవారే నాకు చెప్పలేదు: మోహన్‌బాబు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మోహన్‌బాబు పంచుకున్న వివరాలివీ..

Published : 16 Oct 2022 22:56 IST

హైదరాబాద్‌: వేడుకలో తక్కువగా మాట్లాడాలని తన తనయుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పిన మాటకు షాక్‌ అయ్యానన్నారు మోహన్‌బాబు (Mohan Babu). ‘జిన్నా’ (Ginna) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రమిది. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోనీ కథానాయికలు. మోహన్‌బాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 21 విడుదలకానుంది.

వేడుకనుద్దేశించి మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఎందరో హీరోల వేడుకల్లో, అబ్దుల్‌ కలాం మా విద్యా సంస్థకు వచ్చినప్పుడూ ‘ఇన్ని నిమిషాలే మాట్లాడాలి’ అని ఎవరూ నాకు చెప్పలేదు. కానీ, విష్ణు నన్ను ఈ రోజు తక్కువగా మాట్లాడాలన్నాడు. అది విని షాక్‌ అయ్యా. ‘పెద్దవాళ్లు చెప్పలేదు కదా.. అయినా నేను ఎక్కువగా మాట్లాడతా’ అని అనిపించింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. బిడ్డలను పదిమందిలో పొడగకూడదంటుంటారు. విష్ణు ఎంత గొప్పగా నటించాడో నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకూ కష్టపడనంత విధంగా విష్ణు ‘జిన్నా’కు కష్టపడ్డాడు. ఈ సినిమాకు నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. అది విష్ణుకి బాగుంటుందని కోన వెంకటే చెప్పాడు. సూర్య ఓర్పు, సహనం ఉన్న దర్శకుడు. చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. ఇందులోని ‘జారు మిఠాయా’ సూపర్‌ హిట్‌ కావడానికి దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి కారకుడు. మేం అడగ్గానే వచ్చి, ఈ సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకు అభినందలు’’ అని మోహన్‌బాబు తెలిపారు.

‘‘ఈ సినిమా విషయంలో ముందుగా కోన వెంకట్‌, చోటా కె. నాయుడుగారికి థ్యాంక్స్‌. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. మీరంతా చిత్రాన్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అని విష్ణు అన్నారు. అనంతరం కుటుంబం సభ్యుల గురించి చెబుతూ.. తనకు ప్రతి విషయంలో మోహన్‌బాబు స్ఫూర్తి అని, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ ఎలా చేయాలో తన తల్లి నుంచి, కనుసైగలతో ఎలా కంట్రోల్‌ చేయాలో తన భార్య నుంచి నేర్చుకోవచ్చని విష్ణు సరదాగా చెప్పారు.

దర్శకుడు సూర్య మాట్లాడుతూ.. ‘‘రచయిత కోన వెంకట్‌గారి వల్ల నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. నేను దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి కోన వెంకట్‌తో పరిచయం ఉంది. ఈ చిత్ర ప్రారంభానికి ముందు విష్ణుకి నేను తెలుసు కానీ మోహన్‌బాబుగారికి తెలియదు. వెంకట్‌గారు చెప్పిన ఒకే ఒక మాటతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించే ఛాన్స్‌ నాకు ఇచ్చారు. ఎంతో సపోర్ట్‌ చేశారు. డీవోపీ చోటా కె. నాయుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, ప్రేమ్‌ రక్షిత్‌, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, ఎడిటర్‌ ప్రసాద్‌లతో పనిచేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. సన్నీ లియోనీ ఈ సినిమాకి సర్‌ప్రైజ్‌. పాయల్‌ రాజ్‌పుత్‌ అద్భుతంగా నటించింది. విష్ణు.. కమిట్‌మెంట్‌ ఉన్న నటుడు. అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ కష్టపడుతూనే ఉంటారు. అలా ఓ పాటలోని ఓ షాట్‌ కోసం 13 టేక్‌లు తీసుకున్నారు’’ అని సూర్య తెలిపారు.

‘‘విష్ణు కామెడీ టైమింగ్‌ నాకు బాగా తెలుసు. ఆయన హీరోగా వచ్చిన ‘ఢీ’కు నేను పనిచేశా. అది రచయితగా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. తర్వాత ‘దేనికైనా రెడీ’కి కలిసి పనిచేశాం. మళ్లీ ‘జిన్నా’తో రాబోతున్నాం. ఈ సినిమాకి విజయం అందిస్తారని కోరుకుంటున్నా’’ అని కోన వెంకట్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని