రివ్యూ: దృశ్యం2(మలయాళం)

మోహనల్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ‘దృశ్యం2’ ఎలా ఉందంటే?

Updated : 20 Feb 2021 16:17 IST

చిత్రం: దృశ్యం2; నటీనటులు: మోహన్‌లాల్‌, మీనా, అన్సిబియా హసన్‌, ఏస్తర్‌ అనిల్‌, ఆశా శరత్‌, సిద్ధిఖీ, మురళీ గోపీ, సాయికుమార్‌, అంజలీ నాయర్‌ తదితరులు; సంగీతం: అనిల్‌ జాన్సన్‌; సినిమాటోగ్రఫీ: సతీశ్‌ కురూప్‌; ఎడిటింగ్‌: వి.ఎస్‌.వినాయక్‌; నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్‌; దర్శకత్వం: జీతూ జోసెఫ్‌; బ్యానర్‌: ఆశీర్వాద్‌ సినిమాస్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ యువ కథానాయకులతో పోలిస్తే, ఒక అడుగు ముందుంటారు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌. ఆయన కీలక పాత్రలో 2013లో వచ్చిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘దృశ్యం’. థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోనూ కాసుల వర్షాన్ని కురిపించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం2’. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. ఇందులో మోహనలాల్‌కు ఎదురైన సమస్య ఏంటి? కుటుంబం కోసం దాన్ని ఎలా అధిగమించాడు? మొదటి సినిమాతో పోలిస్తే, సీక్వెల్‌ ఆకట్టుకుందా?

కథేంటంటే: వరుణ్‌ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన జార్జ్‌ కుట్టి (మోహన్‌లాల్‌) కుటుంబం ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ స్థాయి నుంచి థియేటర్‌ ఓనర్‌గా, ఓ సినిమాను నిర్మించే స్థాయికి ఎదుగుతాడు జార్జ్‌. అయితే వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా జార్జ్‌ భార్య రాణి (మీనా), పిల్లలు అంజు, అనుమోల్‌ (అన్సిబా, ఏస్తర్‌ అనిల్‌) భయంతో వణికిపోతుంటారు. పెద్ద కుమార్తె తీవ్ర మానసిక ఒత్తిడితో భయపడిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు వివాహం చేస్తే ఆరోగ్యం కుదట పడుతుందని జార్జ్‌ కుటుంబం భావిస్తుంది. మరోవైపు వరుణ్‌ను జార్జే చంపి ఉంటాడని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసును సీక్రెట్‌గా విచారిస్తుంటారు.  అదే సమయంలో ఐజీ థామస్‌ బాస్టిన్‌ (మురళీ గోపీ) ఆ కేసును రీఓపెన్‌ చేస్తాడు. అప్పుడు జార్జ్‌ ఏం చేశాడు? కేసు రీఓపెన్‌తో జార్జ్‌ భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఈ కేసు నుంచి బయటపడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక సినిమా సీక్వెల్‌, లేదా ప్రీక్వెల్‌ తీయడం మామూలు విషయం కాదు. అదే విజయవంతమైన చిత్రమైతే అంచనాలు భారీగా ఉంటాయి. తొలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సన్నివేశాన్ని పోల్చి చూస్తుంటాడు ప్రేక్షకుడు. ‘దృశ్యం’లాంటి సినిమాకు సీక్వెల్‌ అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్‌. వరుణ్‌ మిస్సింగ్‌ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు భయాలతో జార్జ్‌ భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది చూపించాడు. ఇందుకోసం కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి.

వరుణ్‌ కేసును పోలీస్‌శాఖ సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నట్లు తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ మొదలవుతుంది. అక్కడ దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు. హత్య జరిగిన తర్వాత జార్జ్‌ ఏం చేశాడన్న దానిపై పోలీసుశాఖ విచారణ మొదలుపెడుతుంది. అక్కడి నుంచి తెరపై కథ, కథనాల్లో, సినిమా చూస్తున్న పేక్షకుడి గుండెల్లో వేగం పెరుగుతుంది. వరుణ్‌ కేసు నుంచి ఈసారి జార్జ్‌ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడన్న ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి జార్జ్‌ వేసే ఎత్తులు, పైఎత్తులతో ఉత్కంఠతో సాగిపోతుంటుంది. ముఖ్యంగా చివరి గంటలో మలుపులు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడతాయి. కోర్టు సన్నివేశాలన్నీ అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే: జార్జ్‌ కుట్టి పాత్రలో మోహన్‌లాల్‌ ఎలా ఒదిగిపోయారో మొదటి చిత్రంలోనే నిరూపించారు. ఆ మెరుపులను ఇందులోనూ కొనసాగించారు. జార్జ్‌ భార్యగా మీనా, కుమార్తెలుగా అన్సిబా, ఏస్తర్‌లు తమ పరిధి మేరకు నటించారు. మొదటి భాగంలో లేని కొన్ని పాత్రలు ఇందులో వచ్చాయి. వారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కరోనా కారణంగా ఓటీటీని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ మంది నటులతో, ప్రదేశాలతో సినిమా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. సతీశ్‌ కురూప్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. సన్నివేశానికి తగినట్లు ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దాడు. అనిల్‌ జాన్సన్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌. వి.ఎస్‌. వినాయక్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. మలయాళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమా నిడివిని వదిలేసి ఉంటారు.

దర్శకుడు జీతూ జోసెఫ్‌ ‘దృశ్యం2’ను సవాల్‌గా తీసుకుని తెరకెక్కించారు. ఎందుకంటే సాధారణంగా క్రైమ్‌ థ్రిల్లర్‌ సీక్వెల్స్‌లో ఒక సినిమాలో ఒక కేసు గురించి పరిశోధిస్తే, మరో సినిమాలో ఇంకో కేసును కథానాయకుడు ఎలా ఛేదించాడన్నది చూపించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ‘దృశ్యం’లో ముగిసిన కేసును రీఓపెన్‌ చేస్తే, దాన్ని కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. వరుణ్‌ కేసు తాలూకా భయాలతో జార్జ్‌ కుటుంబం ఎలా ఉందనే విషయాన్ని చూపించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ద్వితీయార్ధంలో కథ, కథనాలను పరుగులు పెట్టించిన విధానం మెప్పిస్తుంది. మోహన్‌లాల్‌లాంటి నటుడి సినిమాను ఓటీటీకే ఎందుకు పరిమితం చేశారో తెలియదు. థియేటర్‌లో విడుదల కావాల్సిన అన్ని కమర్షియల్‌ హంగులు ఈ సినిమాకు ఉన్నాయి.

బలాలు బలహీనతలు
+ కథ, కథనం - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ మోహన్‌లాల్‌  
+ దర్శకత్వం  

చివరిగా: ‘దృశ్యం’కు పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌ ‘దృశ్యం2’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని