Adipurush: ‘ఆదిపురుష్’ టీజర్ ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన ‘శక్తిమాన్’ ముఖేష్ ఖన్నా..!
‘ఆది పురుష్’ టీజర్పై శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ఖన్నా ఘాటుగా స్పందించారు. రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదని విమర్శించారు.
ముంబయి: ఇతిహాసగాథ రామాయణాన్ని ఇలా తీస్తే మాత్రం కుదరదని ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు. ప్రభాస్ రాముడిగా ఓంరౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’. సీతగా కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన టీజర్పై సోషల్మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు.
తాజాగా ‘ఆది పురుష్’ టీజర్ను చూసిన ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇటు రాముడు.. రాముడిగానూ, అటు హనుమాన్.. హనుమంతుడిగానూ కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్లా ఉండరు. రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా, విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి ఉంటారు తప్ప గడ్డాలు, మీసాలు కలిగి ఉండరు’’ అని కాస్త ఘాటూగానే స్పందించారు.
‘‘సినిమాకు ‘ఆది పురుష్’ అని పెట్టారు. బాగానే ఉంది. ఆ పేరు పెట్టుకున్నప్పుడు రాతియుగపు మనిషి స్టోరీ చెప్పి ఉంటే బాగుండేది. కానీ, రామాయణాన్ని ఎంచుకుని, సినిమా చేయాలనుకుంటే పాత్రలు, వాటి ఆహార్యం మార్చాల్సింది. ప్రేక్షకుల విశ్వాసంతో మీరు ఆటలాడుతున్నారు. రూ.100 నుంచి రూ.1000కోట్లు పెట్టి, వీఎఫ్ఎక్స్తో చిత్రాన్ని తీస్తానంటే అది రామాయణం అయిపోదు. అది విలువలు, ప్రతిభలపై ఉంటుంది. ‘అవతార్’ను స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలను తీర్చిదిద్దటం సరైంది కాదు. ఈ విధంగా రామాయణ పాత్రలతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటే, ప్రజలు మిమ్మల్నే చూసి నవ్వటమే కాదు, వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇదొక ఫిక్షనల్ స్టోరీ అంటూ మీరు చెప్పుకోవచ్చు. కానీ, దయచేసి రామాయణం అని మాత్రం చెప్పకండి. సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయకండి. ఇతర మతాలతో ఇలాగే చేయగలరా’’ అని అంటూ ముఖేష్ఖన్నా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న వివిధ భాషల్లో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM