Nag Ashwin: ప్రభాస్‌ సినిమా.. నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా రిప్లై..!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో తెరకెక్కిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సాయం కోరారు..

Published : 04 Mar 2022 17:41 IST

ట్వీట్స్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో తెరకెక్కిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సాయం కోరారు. భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సాంకేతిక సాయం కావాలని అడిగారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆనంద్‌ మహీంద్రాను ట్యాగ్‌ చేస్తూ నాగ్‌ అశ్విన్‌ వరుస ట్వీట్లు చేశారు.

‘‘డియర్‌ ఆనంద్‌ మహీంద్రా సర్‌.. ఎన్నో విషయాల్లో మీ నుంచి ప్రేరణ పొందాను. ప్రస్తుతం నేను.. అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొణె ప్రధాన తారాగణంగా ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఒక ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించి, ఎంతో అధునాతనమైన, విభిన్నమైన వాహనాలను ఈ సినిమా కోసం మేము రూపొందిస్తున్నాం. ఒకవేళ మా కల నిజమైతే.. అది మన దేశానికే గర్వకారణం. భారతదేశంలో మునుపెన్నడూ ఇలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ చిత్రాన్ని మేము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం. కాబట్టి, ఇంజినీర్ల విషయంలో మీ నుంచి మాకు ఏదైనా సాయం ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను’’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా ‘గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌’ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు కావాల్సిన సహకారం అందిస్తారు. తను ఇప్పటికే అధునాతమైన XUV700 వాహనాన్ని (కారు) రూపొందించారు’’ అని ఆనంద్‌ మహీంద్రా బదులిచ్చారు. ఆనంద్‌ మహీంద్రా సమాధానానికి నాగ్‌ అశ్విన్‌ ధన్యవాదాలు తెలిపారు. సంబంధిత అధికారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు.

ఇక, ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ సూపర్‌హీరో రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు