Remake: మలయాళం సినిమా రీమేక్‌కు సిద్ధమైన టాలీవుడ్‌ టాప్‌ హీరో...

టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగార్జున మలయాళ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 2019లో విడుదలైన మలయాళం సినిమాలో కొన్ని మార్పులు చేసి తీయనున్నారని టాక్‌. 

Updated : 24 Nov 2022 12:33 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లోని అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. కొత్తకాన్సెప్ట్‌లతో సినీప్రియులను అలరించే ఈ టాప్‌ హీరో ‘ది ఘోస్ట్‌’(The Ghost) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకొని సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నారు. అందుకే ఈసారి మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన పొరింజు మ‌రియం జోస్‌‌(Porinju Mariam Jose) అనే చిత్రాన్ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. 2019 లో విడుదలైన ఈ మలయాళ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పు చేసి రీమేక్‌ చేయాలని నాగార్జున అనుకుంటున్నారట.

కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్‌ స్టార్‌ హీరో ఈ రీమేక్‌తో మరో ప్రతిభావంతుడిని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నేను లోకల్‌, ధమాక చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడకు నాగ్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఘోస్ట్‌ తర్వాత ఓటీటీ సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని