Namrata: మహేశ్‌, నేనూ భయపడ్డాం: నమ్రత

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా నుంచ..

Published : 16 Apr 2022 01:57 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. అవి రెండూ విశేష ఆదరణ పొందాయి. ఇక ‘పెన్నీ’ పాట కోసం సితార స్టెప్పులేయడం సూపర్‌స్టార్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ పాట కోసం సితారను ఎంపిక చేయడంపై మహేశ్‌ సతీమణి నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సితారకు డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. తరచూ తన డ్యాన్స్‌ వీడియోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటుంది. ‘సర్కారువారి పాట’ నుంచి కళావతి పాట విడుదలైనప్పుడు ఆ పాటకు రీల్‌ చేసి దాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అది చూసిన తమన్‌ ఓసారి మహేశ్‌ని కలిసి.. ‘‘పెన్నీ పాటకు సితారతో డ్యాన్స్‌ చేయిస్తే బాగుంటుంది’’ అని చెప్పారు. అదే విషయాన్ని మహేశ్‌.. సితారతో చెప్పగానే తను ఆనందంతో గెంతులేసింది. అలా సితారను ఆ పాటలో భాగం చేశాం. ఇక సితార ఇలా కెమెరా ముందుకు వచ్చి ఓ సినిమా కోసం డ్యాన్స్‌ చేయడం ఇదే మొదటిసారి. తను ఎలా చేస్తుందోనని నేనూ, మహేశ్‌ ఎంతో కంగారుపడ్డాం. అనుకున్న విధంగా వీడియో వస్తేనే దాన్ని విడుదల చేయాలని.. లేకపోతే వద్దని నిర్ణయించుకున్నాం. కానీ సితార బాగా చేసింది. తన డ్యాన్స్‌తో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని నమ్రత వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని