Naresh: పండ్లు అమ్మిన సీనియర్‌ హీరో

సీనియర్‌ హీరో, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌ వ్యాపారిగా అవతారమెత్తారు. పండ్ల వ్యాపారిగా మారి రూ.మూడు వేల ఆదాయం పొందారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్‌...

Published : 23 Jun 2021 13:46 IST

హైదరాబాద్‌: సీనియర్‌ హీరో, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌ వ్యాపారిగా అవతారమెత్తారు. పండ్ల వ్యాపారిగా మారి రూ.మూడు వేల ఆదాయం పొందారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్‌ సమయం తీసుకుని రైతుగా మారి తన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది పండిన మామిడి, నేరేడు పండ్లను తన స్టూడియోలో పనిచేస్తున్న వారికి అతి తక్కువ ధరకు విక్రయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన నేరేడు, మామిడిని కేజీ రూ.50లకే విక్రయించి రూ.3600 సంపాదించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా నటుడిగా అత్యధిక పారితోషికం పొందిన దానికంటే కూడా ఈ చిన్న మొత్తమే తనకెంతో ఆనందాన్ని అందించినట్లు ఆయన వివరించారు.

‘పండంటి కాపురం’, ‘రెండు కుటుంబాల కథ’ వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించిన నరేష్‌ ‘ప్రేమ సంకెళ్ళు’తో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ‘ప్రేమ ఎంత మధురం’, ‘మొగుడు పెళ్ళాలూ’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హైహై నాయకా’, ‘జంబలకిడిపంబ’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో నరేష్‌ హీరోగా నటించారు. ‘మల్లీశ్వరీ’, ‘యమదొంగ’, ‘అందరి బంధువయా’, ‘భలే భలే మగాడివోయ్‌’ తదితర చిత్రాలు ఆయనకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని