Theatre: కొత్త ట్రెండ్‌.. వెండి తెరకెక్కిన ప్రచారం.. అభిమానుల్లో ఉత్సాహం!

సినిమా ప్రచార చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల ట్రైలర్లను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు దర్శకనిర్మాతలు. 

Updated : 10 May 2023 10:15 IST

నిన్న మొన్నటి వరకు టీజర్‌, ట్రైలర్‌, పాటలతో సినిమాలపై ఆసక్తి రేకెత్తించి ప్రేక్షకులను దర్శక, నిర్మాతలు థియేటర్లకు రప్పించేవారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాలను థియేటర్లలో ప్రదర్శిస్తూ ఆయా హీరోల అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ఆ సంగతులపై ఓ లుక్కేయండి..

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ఏదైనా చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్తే.. ఆ చిత్రం ప్రారంభానికి ముందు త్వరలో విడుదలకాబోయే సినిమాల టీజర్‌, ట్రైలర్లు ప్రదర్శిచడం గమనించే ఉంటారు. విడుదల కాబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఫిల్మ్‌ మేకర్స్‌ దానొక మార్గంగా భావిస్తుంటారు. ఇప్పుడు కొందరు మరో అడుగు ముందుకేశారు. యూట్యూబ్‌ వేదికగా విడుదల చేసిన ఆయా ప్రచార చిత్రాలను 70 ఎం. ఎం. స్క్రీన్‌పైనా విడుదల చేస్తున్నారు. ముందుగా థియేటర్లలో ప్రచారాస్త్రం వదిలి, ఆ తర్వాత నెట్టింట్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి అగ్ర కథానాయకుల సినిమాల విషయంలోనే నడుస్తోన్న ఈ ట్రెండ్‌ భవిష్యత్తులో చిన్న చిత్రాలకు ప్రయోజనకరంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమా ప్రమోషన్స్‌ను థియేటర్లలో ప్రారంభించడం మొదలుపెట్టిన రెండు/మూడు రోజుల వ్యవధిలోనే.. ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమాల ప్రచార చిత్రాలను ఈ తరహాలో తీసుకొస్తుండడంతో అది హాట్‌టాపిక్‌గా మారింది. 

ప్రభాస్‌ (prabhas) హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆది పురుష్‌’ (adipurush) జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే టీజర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.. ఇక ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో సోమవారం ప్రదర్శించింది. ప్రభాస్‌, హీరోయిన్‌ కృతిసనన్‌, దర్శకుడు ఆ ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు. మంగళవారం ఆన్‌లైన్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వందకిపైగా థియేటర్లలో 3డీ ట్రైలర్‌ని విడుదల చేశారు.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (ustaad bhagatSingh) టీమ్‌ సైతం తమ చిత్ర ప్రచారాన్ని వెండి తెర వేదికగానే మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత హీరో పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan), దర్శకుడు హరీశ్‌శంకర్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో మే 11వ తేదీ సాయంత్రం 4:59 గంటలకు ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేయనున్నట్టు ‘ఉస్తాద్‌..’ చిత్ర బృందం ప్రకటించింది. 2012లో మే 11న ‘గబ్బర్‌సింగ్‌’ (gabbar singh) విడుదలకావడంతో అదే రోజున ఫ్యాన్స్‌కు ఈ ట్రీట్‌ ఇవ్వనుంది. వీటికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు.

ఏజెంట్‌.. ప్రెస్‌మీట్‌

ప్రచారం విషయంలో ‘ఏజెంట్‌’ చిత్ర బృందం విభిన్నంగా ఆలోచించింది. ఆ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. అఖిల్‌ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఏప్రిల్‌ 28న విడుదలైంది. 

ట్రైలర్ల కోసం ప్రత్యేక షో..

దర్శక, నిర్మాతలు అలా ఆలోచిస్తే.. పీవీఆర్‌, ఐనాక్స్‌ (pvr-inox) సంస్థలు వారు కొత్త కాన్సెప్ట్‌ తీసుకొచ్చారు. విడుదలకు సిద్ధంగా ఉన్న 10 సినిమాల ట్రైలర్లను రూ. 1కే వీక్షించేలా ప్రేక్షకులకు ఆఫర్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 7 నుంచి 10వ తేదీ వరకు ముంబయిలోని మల్టీప్లెక్స్‌లలో ప్రయోగం చేసి విజయం సాధించారు. ఆ ‘ట్రైలర్‌ స్క్రీనింగ్‌ షో’ను చూసేందుకు 35,000 వెళ్లారట. ఇలాంటి కాన్సెప్ట్‌ల వల్ల థియేటర్‌ వ్యవస్థ మరింత మెరుపడుతుందని సినీ పండితులు అంటున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు