Tollywood: కథమ్మ... కలిపింది ఇద్దరినీ...!

కాంబినేషన్ల కంటే కథల్నే బలంగా విశ్వసిస్తున్నారు ఈతరం స్టార్‌ నాయికలు. కథ బాగుండి.. అందులో తమ పాత్రలకు ప్రాధాన్యముందనిపిస్తే చాలు.. ఇమేజ్‌ని పక్కకు పెట్టి మరీ ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. ఓ వైపు అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే.. మరోవైపు కుర్ర హీరోల సరసన సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీప్రియులకు ప్రత్యేకమైన కలయికలు చూసే అవకాశం దక్కుతోంది.

Updated : 28 Mar 2022 09:50 IST

కాంబినేషన్ల కంటే కథల్నే బలంగా విశ్వసిస్తున్నారు ఈతరం స్టార్‌ నాయికలు. కథ బాగుండి.. అందులో తమ పాత్రలకు ప్రాధాన్యముందనిపిస్తే చాలు.. ఇమేజ్‌ని పక్కకు పెట్టి మరీ ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. ఓ వైపు అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే.. మరోవైపు కుర్ర హీరోల సరసన సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీప్రియులకు ప్రత్యేకమైన కలయికలు చూసే అవకాశం దక్కుతోంది.

క్కసారి స్టార్‌ స్థాయికి చేరుకుంటే అందుకు తగ్గ కథలు, కాంబినేషన్లతోనే ప్రయాణం చేయాలనుకుంటారు కథానాయికలు. అందుకు విరుద్ధంగా ప్రయత్నిస్తే స్టార్‌డమ్‌ దెబ్బతింటుందన్న భయాలు వెంటాడేవి. ఈతరం నాయికలు అలాంటి భయాల్ని దూరం పెట్టేస్తున్నారు. కథ బాగుంటే చాలు.. అగ్ర, కుర్ర కథా నాయకులన్న లెక్కలకు పోకుండా రంగంలోకి దూకేస్తున్నారు.

* ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాలతో నాయికా ప్రాధాన్య సినిమాలకు చిరునామాగా మారింది అనుష్క. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న   ఈ సీనియర్‌ భామ.. మళ్లీ కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు     సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె యు.వి. క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపింది. పి.మహేష్‌బాబు దర్శకుడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఓ కొత్తతరం కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో.. యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టితో కలిసి సందడి చేయనుంది అనుష్క. ఈ ప్రత్యేకమైన  కాంబినేషన్‌పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు  నెలకొని ఉన్నాయి.

* చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర హీరోలు మొదలు.. రవితేజ, ప్రభాస్‌ వంటి ఈతరం హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేసిన కథానాయిక నయనతార. ఇప్పుడామె  చిరంజీవి - మోహన్‌రాజా కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గాడ్‌ఫాదర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె యువహీరో సత్యదేవ్‌తో కలిసి తెర పంచుకోనుంది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.

* మరో సీనియర్‌ భామ తమన్నా సైతం యువ హీరోలతో కలిసి సందడి చేస్తోంది. ప్రస్తుతం వెంకటేష్‌కు జోడీగా ‘ఎఫ్‌3’, చిరంజీవికి జంటగా ‘భోళా శంకర్‌’ చిత్రాల్లో  నటిస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు ‘గుర్తుందా శీతాకాలం’ కోసం సత్యదేవ్‌తో తెర పంచుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా తాజాగా వరుణ్‌తేజ్‌ ‘గని’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.


నాయికలకు భలే లాభం..

వైపు అగ్రహీరోలతో ఆడిపాడుతూనే.. కుర్రహీరోల చిత్రాల్లోనూ చేయడం సీనియర్‌ కథానాయికలకు భలే కలిసొస్తోంది. కోరినంత భారీ పారితోషికాలు దక్కించుకోవడంతో పాటు తామింకా కుర్ర భామలమే అన్న సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ఫలితంగా వరుస అవకాశాలతో కెరీర్‌ని మరింత కాలం ముందుకు తీసుకెళ్లే అవకాశం దొరుకుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని