Nikhil: దయచేసి సాయం చేయండి

కొవిడ్‌ కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ సాయం చేస్తున్న వారి రూపంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని రుజవైందని నటుడు నిఖిల్‌....

Published : 09 May 2021 13:47 IST

వీడియో షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: కొవిడ్‌ కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ సాయం చేస్తున్న వారి రూపంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని రుజవైందని నటుడు నిఖిల్‌ అన్నారు. ప్రస్తుతం ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారని.. వీలైనంత వరకూ ప్రతిఒక్కరూ చేతనైనంత సాయం చేయాలని నిఖిల్‌ ఓ వీడియో సందేశంలో కోరారు.

‘బాధ, కోపం, చిరాకు, నిరాశతో ఈ వీడియో చేస్తున్నాను. కొవిడ్‌ కారణంగా గత కొన్ని వారాల నుంచి షూటింగ్స్‌ రద్దు చేసుకుని ఇంటికే పరిమితమయ్యాను. నాకు తెలిసిన స్నేహితులతో కలిసి ట్విటర్, ఇతర సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా సాయం కోరిన వారందరికీ సాయం అందిస్తున్నాను. మందులు, ఇంజెక్షన్స్‌, ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్‌, ఐసీయూ వార్డులు.. ఇలా సాయం చేస్తూనే ఉన్నాను. కానీ అది సరిపోవడం లేదు. ఎందుకంటే ఎంతోమంది ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తెలిసిన బంధువులు, సాయం కోరిన కొంతమంది కళ్లముందే చనిపోవడం చూస్తుంటే బాధగా ఉంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారు అనుకుంటే అది  జరగని పని. రాజకీయనాయకులు, ఇతర నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో ఎంతో బిజీగా ఉన్నారు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మాస్క్‌లు పెట్టుకోండి. శానిటైజర్లు వాడండి. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సంతోషాన్ని అందించే విషయం ఏమిటంటే ప్రజలందరూ ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ముందుకు రావడం. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నారు. ఈ వీడియో ద్వారా నేను కోరేది ఏమిటంటే.. దయచేసి అందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ కల్లోలం నుంచి సురక్షితంగా బయటపడదాం’ అని నిఖిల్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని