NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్‌

కల్యాణ్‌రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ అతిథిగా హాజరై, సందడి చేశారు.

Updated : 05 Feb 2023 22:50 IST

హైదరాబాద్‌: అప్‌డేట్‌ కావాలంటూ చిత్ర దర్శక, నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావొద్దని అభిమానులకు ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ (NTR) విజ్ఞప్తి చేశారు. చెప్పాల్సిన సందర్భం వస్తే తన భార్య కంటే ముందుగా వారికే చెబుతానని పేర్కొన్నారు. ‘అమిగోస్‌’ (Amigos) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు.

వేడుకనుద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా మీ అందరినీ చూసేందుకు ఇక్కడికి వచ్చా. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్‌ చదివారు. ‘చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఎందుకీ సినిమాలు’ అని తన తల్లిదండ్రులు అంటే ‘నేను ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఇంటికి వస్తా’ అని ఆయన సమాధానమిచ్చారు. కానీ, సినిమా ప్రారంభమయ్యేలోపు తన మాతృమూర్తిని కోల్పోయారు. చిత్రీకరణ ఆఖరి దశలో ఉండగా వారి నాన్న కన్నుమూశారు. రాజేంద్రను చూస్తుంటే సినిమా పట్ల ఓ వ్యక్తికి ఇంత తాపత్రయం ఉంటుందా? అని అనిపిస్తుంటుంది. ఈ సినిమా హిట్‌కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నా శ్రేయోభిలాషులు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకే ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి రెండు సినిమాలు విడుదలై, సూపర్‌హిట్‌ అందుకోవడం వారికే సాధ్యమైంది. మా కుటుంబంలో ఎంతమంది నటులున్నా.. ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కల్యాణ్ అన్న ఒక్కరే. నటుడిగా, నిర్మాతగా సినిమాల్లో టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే. అన్నయ్య ఏంటీ ప్రయోగాత్మక చిత్రాలే చేస్తారా.. మరి మాస్‌ సినిమాలు ఎప్పుడు చేస్తారు? అని ఒకానొక సమయంలో అనుకున్నా. ‘అతనొక్కడే’, ‘పటాస్‌’ ‘బింబిసార’తో ఆ లోటును తీర్చారు. మూడు విభిన్న పాత్రలను ఒకే సినిమాలో పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘ఎమిగోస్‌’ సినిమా కల్యాణ్‌ అన్న కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని నమ్ముతున్నా’’ 

‘‘మేం అమెరికా, జపాన్‌ వెళ్లామని, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకకు వెళ్లామని, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కిందంటూ చాలామంది గొప్పగా చెబుతున్నారు. అయితే, అది మా గొప్పతనంకాదు. ప్రేక్షకులు, అభిమానుల ఆశీర్వాదంతో పాటు తోటి నటీనటులు, కార్మికుల ప్రోత్సహం, ప్రేమతో అక్కడికి వెళ్లాం. అన్నింటి కంటే ముఖ్యంగా ఇది జక్కన్న (రాజమౌళి) విజయం. ఆయన మాకు ఆ పాత్రలను ఇచ్చారు కాబట్టే ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి’’ అని తెలిపారు.

మీ ఉత్సాహం నాకు అర్థమవుతోంది.. కానీ,

అభిమానులు తన తదుపరి చిత్రం అప్‌డేట్‌ ఇవ్వాలంటూ హంగామా చేస్తుంటే ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘సినిమాలు చేసేటపుడు మీతో చెప్పేందుకు ఏం ఉండదు. ప్రతిరోజూ, ప్రతి పూటా, ప్రతి గంటకూ అప్‌డేట్‌ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం నాకు అర్థమవుతోంది. కానీ, దానివల్ల దర్శక- నిర్మాతలపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఫ్యాన్స్‌ అడుగుతున్నారని వారు భావించి ఏది పడితే అది చెప్పలేరు. ఏదైనా అప్‌డేట్‌ ఇచ్చినప్పుడు అది నచ్చకపోతే మళ్లీ వాళ్లనే మీరు తిడతారు. ఇది నా విషయంలోనే కాదు అందరు హీరోలకు ఇలానే జరుగుతోంది. తప్పకుండా ఇవ్వాల్సిన, అదిరిపోయే అప్‌డేట్‌ ఏదైనా ఉంటే భార్యకంటే ముందు మీకే చెబుతాం. ఎందుకంటే మీరు మాకు అంత ముఖ్యం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఈ నెలలోనే సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తాం. మార్చి 20లోపే చిత్రీకరణ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్‌ 5న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమది.

ఈ చిత్రాలు వేరు.. అమిగోస్‌ వేరు: కల్యాణ్‌రామ్‌

‘‘అమిగోస్‌ (ఫ్రెండ్స్‌) అంటే ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ద్విపాత్రాభినయం (అన్నదమ్ముల నేపథ్యంలో)ను ప్రారంభించింది మా తాతగారు. రాముడు- భీముడు చిత్రంతో అది మొదలైంది. తప్పు చెప్పి ఉంటే క్షమించండి. ఆ తర్వాత బాబాయ్‌ బాలకృష్ణ అదే పేరుతో ఓ సినిమా చేశారు. చిరంజీవి గారు ‘ముగ్గురు మొనగాళ్లు’ చేశారు. తమ్ముడు ఎన్టీఆర్‌ ‘జై లవ కుశ’ చేశాడు. వీటన్నింటిలోని కామన్‌ పాయింట్‌ ఆయా పాత్రల మధ్య కుటుంబ బంధం. కానీ, అమిగోస్‌ విభిన్నంగా ఉంటుంది. మీరంతా ఆదరిస్తారనే నమ్మకంతోనే నేనెప్పుడూ వైవిధ్యభరిత చిత్రాలు చేస్తుంటా. ఇంతకాలం నన్ను భరించినందుకు ధన్యవాదాలు (నవ్వులు). నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన తమ్ముడు తారక్‌కి థాంక్స్‌’’ అని కల్యాణ్‌రామ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని