NTR: ఎన్టీఆర్‌ తీరని కోరిక.. ఆ సినిమాకు అన్నీ అడ్డంకులే!

ఎన్నో పౌరాణిక, చారిత్రక కథలకు, పాత్రలకు ప్రాణం పోసి ఖండాంతర ఖ్యాతిని గడించిన విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు (Nandamuri taraka rama rao). మరి అలాంటి మహానటుడికి నెరవేరని కోరిక ఉంటుందా? నిజమే ఉంది

Updated : 28 May 2023 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నో పౌరాణిక, చారిత్రక కథలకు, పాత్రలకు ప్రాణం పోసి ఖండాంతర ఖ్యాతిని గడించిన విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు (Nandamuri taraka rama rao). మరి అలాంటి మహానటుడికి నెరవేరని కోరిక ఉంటుందా? నిజమే ఉంది. విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలనే అభిలాష ఎన్టీఆర్‌కు చివరికి తీరని కోరికగానే మిగిలిపోయింది. 1954లో దర్శక-నిర్మాత ఎస్‌.ఎం.శ్రీరాములు కోయంబత్తూరులోని తన సొంత పక్షి రాజా స్టూడియోలో ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మిస్తున్నారు. అందులో ప్రముఖ బుర్రకథ పితామహుడు నాజర్‌ బృందంతో అల్లూరి సీతారామరాజు బుర్రకథను అంతర్నాటకంగా చిత్రీకరించారు. అందులోని ఆత్రేయ రాసిన పాట ఎన్టీఆర్‌పై పెను ప్రభావం చూపించింది. దీంతో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. తన సొంత ఎన్‌.ఎ.టి. సంస్థలో అప్పటికే తొలి చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’(1953) విడుదలైంది. రెండో చిత్రం ‘తోడు దొంగలు’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక అల్లూరి సీతారామరాజు నిర్మించాలని భావించారు.

ఆ రోజుల్లో పడాల రామారావు అల్లూరి సీతారామరాజు కథను నాటకంగా మలిచి ఎందరో కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వందల ప్రదర్శలను ఇచ్చేందుకు దోహదపడ్డారు. అందుకే ఆయనతో పాటు, జూనియర్‌ సముద్రాలతో కలిసి స్క్రిప్టు పనులకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్‌. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలే తీర్చిదిద్దిన కళారూపాన్ని అనుసరించి తొలి మేకప్‌ స్టిల్‌ కూడా తీశారు. అయితే ‘తోడు దొంగలు’ తర్వాత ‘జయసింహ’ చిత్రాన్ని అప్పటికే ప్రకటించి ఉండటంతో ఆ సినిమాను పూర్తి చేసి ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని ప్రారంభించాలని ఎన్టీఆర్‌ భావించారు. 1955లో ‘జయసింహ’ విడుదలైన ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1957 జనవరిలో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తొలి పాట రికార్డింగుకు ముహూర్తం నిర్ణయించారు. వాహినీ స్టూడియోలో పడాల రామారావు రాసిన బృందగీతాన్ని టి.వి.రాజు సంగీత పర్యవేక్షణలో రికార్డు చేశారు. ఆ పాటను ఘంటసాల, ఎమ్మెస్‌ రామారావు, మాధవపెద్ది, పిఠాపురంతో కలిసి 12 మంది కోరస్‌ గాయకులు ఆలపించారు. ఆ వివరాలు ఆంధ్ర సచిత్ర వార పత్రికలోనూ వచ్చాయి. ఆ తర్వాత ఏవో అడ్డంకుల కారణంగా ‘అల్లూరి సీతారామరాజు’ను పక్కన పెట్టారు.

ఈలోగా ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రాన్ని ఎన్టీఆర్‌ పట్టాలెక్కించారు. 1957లో విడుదలైన ఆ చిత్రం ఎన్టీఆర్‌కు మంచి పేరు తెచ్చింది. అయితే అప్పటికే తయారైన ‘అల్లూరి సీతారామరాజు’ కథలో హీరోయిన్‌కు స్థానం లేకపోవడంతో అందుకు అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసేందుకు కొంత పరిశోధన చేయాల్సిందిగా పడాల రామారావు.. ఎన్టీఆర్‌ను కోరగా, కొంత వ్యవధి ఇచ్చారు. ఈలోగా ‘సీతారామకల్యాణం’ విడుదలై ఎన్టీఆర్‌కు గొప్ప ఇమేజ్‌ను తెచ్చింది. అంతటితో అల్లూరి కథ అటకెక్కింది. అయితే ‘వరకట్నం’ సినిమా గురించి ఎన్టీఆర్‌ ప్రకటన చేస్తూ ‘అల్లూరి సీతారామరాజు’ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు ‘వరకట్నం’ సినిమాతో సమాంతరంగా నిర్మిస్తామని తెలిపారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత వినోద సంస్థ అధినేత డీఎల్‌ నారాయణ శోభనబాబుతో ‘అల్లూరి సీతారామరాజు’ నిర్మిస్తానని ప్రకటించారు. అందుకోసం స్క్రిప్టును కూడా సిద్ధం చేశారు. అయితే ఆర్థిక వనరుల లేమి కారణంగా ప్రయత్నం విరమించుకున్నారు. ఆ కథను ‘సూపర్‌స్టార్‌’ కృష్ణకు అందజేశారు. త్రిపురనేని మహారథి ఆ స్క్రిప్టునకు మెరుగులు దిద్దగా కృష్ణ 1974లో ‘అల్లూరు సీతారామరాజు’ తన 100వ చిత్రంగా ఈస్ట్‌మన్‌ కలర్‌లో సినిమా స్కోపుగా నిర్మించి బ్రహ్మాండమైన విజయం సాధించారు. ‘అల్లూరి సీతారామరాజు’గా కృష్ణ అభినయానికి ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు.

అయితే, సీతారామరాజు పాత్రపై తనకున్న మక్కువను తీర్చుకునేందుకు ఎన్టీఆర్‌ ‘సర్దార్ ‌పాపారాయుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమాల్లో ఆ గెటప్‌లో కనిపించి తృప్తి పడాల్సి వచ్చింది. అయితే, కృష్ణ నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్‌.. పరుచూరి సోదరులను సంప్రదించి తన వద్ద ఉన్న పూర్వ కథకు మెరుగులు దిద్దమని కోరారు. అయితే వాళ్లు కృష్ణ సినిమాను ఒకసారి చూడమని ఎన్టీఆర్‌ను కోరారు. అలా అన్నగారి కోరిక మీద కృష్ణ తను నిర్మించిన సినిమాను మద్రాసులో ప్రత్యేక ప్రదర్శన వేశారు. ఆ సినిమా చూశాక ఎన్టీఆర్..‌ కృష్ణను అభినందించి, ‘అల్లూరు సీతారామరాజు’ చిత్రాన్ని చేయాలన్న కోరికను శాశ్వతంగా విరమించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని