NTR: ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయకపోవడానికి కారణమిదే: ఎన్టీఆర్‌

ఆస్కార్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ( RRR) టీం వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) ఓ విదేశీ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

Updated : 10 Mar 2023 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఎన్టీఆర్‌ (NTR) అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆస్కార్‌ (Oscar) వేడుకకు హాజరయ్యేందుకు లాస్‌ ఏంజిల్స్‌ చేరుకున్న తారక్‌.. అక్కడ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అలాగే అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ జోష్‌ నింపుతున్నారు. ఇక తమ అభిమాన హీరోలు ఆస్కార్‌ వేడుకలో రెడ్‌ కార్పెట్‌పై నడిచే రోజు కోసం సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు.  తాజాగా ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ( RRR) టీం రెడ్‌ కార్పెట్‌పై నడవడం గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘‘అక్కడ నడవనుంది జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా కొమురం భీమ్‌ అని నేను అనుకోను. అలాగే రాజమౌళి, రామ్‌ చరణ్‌ (Ram Charan) అని కూడా అనుకోవడం లేదు. రెడ్‌ కార్పెట్‌పై నడిచేటప్పుడు మేము మొత్తం భారతదేశాన్ని మా హృదయాల్లో మోయనున్నాం, నేను ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. మేము ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం లేదు. అందుకే మేము ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం. ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్‌ చేస్తూనే ఉంటాయి’’ అని చెప్పారు.

తాను అమెరికాలో ఉన్న కారణంగా తన పిల్లలను మిస్‌ అవుతున్నానని తారక్‌ అన్నారు. ‘‘నేను నటుడినని నా పిల్లలకు తెలుసు. కానీ వాళ్లకు ఆస్కార్‌ అంటే ఏంటి.. దాని గొప్పతనం.. ఇలాంటి వాటి గురించి తెలీదు. నేను ఒక రోజు వాళ్లకు ఆస్కార్‌ గురించి గర్వంగా చెబుతాను. ఆస్కార్‌కు మనం వెళ్లామని గొప్పగా చెబుతాను. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పాలి’’ అంటూ సినిమాపై ఇంత అభిమానం చూపిన అందరికీ ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఆస్కార్‌ నుంచి తిరిగి వచ్చాక కొరటాల శివ సినిమా ( NTR 30) షూటింగ్‌లో ఎన్టీఆర్‌  పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని