Adipurush: సైఫ్‌ లుక్‌ కాంట్రవర్సీ.. ఓం రౌత్‌ క్లారిటీ

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్‌ అంతటా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందులోని పాత్ర లుక్స్‌పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు ఓం రౌత్‌ స్పందించారు.

Published : 07 Oct 2022 10:52 IST

ముంబయి: సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి పాత్రధారి అయిన సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్‌ చేస్తున్నారు. గతంలో వచ్చిన ‘రామాయణం’ సీరియల్‌లోని రావణాసురుడి లుక్‌ని ‘ఆదిపురుష్‌’లోని లుక్‌తో పోల్చుతూ పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. దీనిపై తాజాగా డైరెక్టర్‌ ఓం రౌత్‌ స్పందించారు.

‘‘రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్స్‌తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’లో పొడవాటి జుత్తు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంలో రావణాసురుడిని చూపించారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలియజేశారు. కానీ, ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని అనుకుంటున్నా. ఈ సినిమాతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజెప్పాలనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే రావణాసురుడి లుక్‌ని అలా డిజైన్‌ చేశాం. రావణాసురుడు ఒక భయంకరమైన పక్షిపై ప్రయాణిస్తున్నట్లు టీజర్‌లో చూపించాం. అయితే, దాన్ని కూడా అందరూ తప్పుపడుతున్నారు. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రావొద్దు. సినిమా చూశాక మాట్లాడండి. ఇక సినిమాలో హనుమంతుడికి లెదర్‌ దుస్తులు వేశామని అందరూ విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము ఎలాంటి లెదర్‌ దుస్తులు ఉపయోగించలేదు’’  అని ఓంరౌత్‌ వివరణ ఇచ్చారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఓం రౌత్‌ తెరకెక్కించారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా సిద్ధమైన ఈ సినిమాలో కృతిసనన్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని