లాక్‌డౌన్‌ దెబ్బ: రూ.400కోట్ల నష్టం

మహారాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం బాలీవుడ్‌కి శరాఘాతంలా మారింది. ఇప్పటికే

Published : 06 Apr 2021 13:48 IST

బాలీవుడ్‌లో వాయిదా పడుతున్న భారీ చిత్రాలు

ముంబయి: మహారాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం బాలీవుడ్‌కి శరాఘాతంలా మారింది. ఇప్పటికే పలు పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడగా.. మరికొన్ని అదే బాటలో ఉన్నాయి. రాత్రిపూట కర్ఫ్యూతో ఇప్పటికే రెండు షోలు రద్దు కాగా వారాంతపు లాక్‌డౌన్‌తో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం వరకు సినిమా హాళ్లు మూతపడనున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ రూ.400 కోట్ల మేర నష్టపోయినట్లు పరిశ్రమ వర్గాల అంచనా.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సర్కారు వారాంతాల్లో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ నిర్ణయం బాలీవుడ్‌పై మరోసారి తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం కాగా.. ప్రభుత్వ నిర్ణయంతో వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే వినోద రంగం కోలుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్‌ నిర్ణయం బాలీవుడ్‌కు వేదన మిగిల్చింది.

ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండగా, మహారాష్ట్రలో 50 శాతం సీటింగ్‌తో నడుస్తున్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు దిగిన రాష్ట్ర సర్కారు వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన సూర్యవంశీ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవన్న ఆందోళన ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తమవుతోంది. అమితాబ్‌ నటించిన ‘చెహ్రీ’, సైఫ్‌ అలీఖాన్‌, రాణీముఖర్జీ తారాగణంగా తెరకెక్కిన ‘బంటీ ఔర్‌ బబ్లీ-2’ సినిమాల విడుదల ఇప్పటికే వాయిదాపడ్డాయి. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’, జాన్‌ అబ్రహాం ‘సత్యమేవ జయతే’తోపాటు పలు చిత్రాలు కూడా వాయిదా బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలు విడుదలయ్యేది అనుమానమేనని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

నెలల పాటు మూసి ఉన్న థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు.. కొవిడ్‌ నిబంధనల అమలు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు థియేటర్ల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూతో ఇప్పటికే రెండు షోలు రద్దు కాగా తాజాగా తీసుకున్న వారాంతపు లాక్‌డౌన్‌తో రూ.కోట్లలో నష్టం తప్పదని పేర్కొంటున్నారు. వారాంతాల్లోనే థియేటర్లు కళకళలాడుతుంటాయని, అలాంటి రోజుల్లో లాక్‌డౌన్‌ అమలు చేయడం తమకు తీవ్ర నష్టమని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిపాటు సినిమాహాళ్లను మూసినా.. కేసులు కొనసాగుతున్నాయని, కొవిడ్‌ కట్టడికి థియేటర్ల మూసివేత పరిష్కారం కాదంటున్నారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు టీకా పంపిణీపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ఒక్కో టాకీస్‌కు సగటున నెలకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లనుందని.. ఇప్పటివరకు బాలీవుడ్ రూ.400 కోట్ల మేర నష్టపోయినట్లు ఎగ్జిబ్యూటర్లు అంచనా వేశారు. మహారాష్ట్ర ప్రభావం యావత్‌ దేశంపై ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాలీవుడ్‌ సినిమాల విడుదల ఆగిపోతే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటుందని ఎగ్జిబ్యూటర్లు పేర్కొంటున్నారు. ఇటీవల సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసిన థియేటర్ల యజమానులు ఆస్తి పన్ను, కనీస విద్యుత్‌ ఛార్జీలు, విడుదలయ్యే చిత్రాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కోరారు. సినీరంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారని, వారిని ఆదుకోవాలని శివసేన ప్రభుత్వాన్ని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని