Organic Mama Hybrid Alludu: తపనతో పనిచేశాం.. ఫలితాన్ని తెరపై చూస్తారు!

రాజేంద్ర ప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’.

Updated : 28 Oct 2022 10:31 IST

రాజేంద్ర ప్రసాద్‌ (Rajendraprasad), మీనా (Meena) ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu). కోనేరు కల్పన నిర్మించారు. సోహెల్‌, మృణాళిని జంటగా నటించారు. కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌ను దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి అనే టైటిల్‌ కార్డు చూసి చాలా రోజులైంది. ఉరుకుల పరుగుల ప్రస్తుత తరానికి కృష్ణారెడ్డి సినిమాలు ఎంతో రిలీఫ్‌ ఇస్తాయన్నది నా భావన. ఆయన చిత్రాలు వాణిజ్య హంగులతో ఉంటూనే పిల్లలకూ నచ్చేలా ఉంటాయి. ఈ ట్రైలర్‌ చూశాక ‘కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్‌’ అని గట్టిగా చెప్పొచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘కుటుంబాల్ని థియేటర్స్‌కు రప్పించే కంటెంట్‌ ఇప్పటి సినిమాల్లో తగ్గిపోయింది. అటువంటి కంటెంట్‌కు చిరునామా ఎస్వీ కృష్ణారెడ్డి. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో థియేటర్స్‌ మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయని నాకు గట్టి నమ్మకం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ టైమ్‌లో ఈ కథ రాసుకున్నా. అచ్చిరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కథకు మాటలు కూడా అందించా. ఈ స్క్రిప్ట్‌ కల్పనకు వినిపించగానే షాక్‌ అయ్యారు. దీన్ని తెరపైకి తీసుకురావాల్సిందేనని ఆమె ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. అలా పట్టాలెక్కిన ఈ చిత్రం 44రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న ఆర్టిస్ట్‌లను, మరికొన్ని పాత్రలకు పేరున్న నటుల్ని తీసుకున్నా. రాజేంద్ర ప్రసాద్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఓ పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరం ఎంతో తపనతో పని చేశాం. దాని ఫలితాన్ని త్వరలో తెరపై చూస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సోహెల్‌, అలీ, అచ్చిరెడ్డి, హేమ, ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని