మరో శోభన్‌బాబు అవుతాడనుకున్నాం!

కథానాయకుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో అలరించిన నటుడు సురేశ్‌. ఒకప్పుడు వరుస చిత్రాలతో

Updated : 29 Mar 2021 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కథానాయకుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో అలరించిన నటుడు సురేశ్‌. ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన ఆయన ఇటీవల పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఒదిగిపోతున్నారు. అప్పట్లో సురేశ్‌ ఎంచుకున్న కథలు చూసి, తెలుగు చిత్ర పరిశ్రమలో మరో శోభన్‌బాబు అవుతాడని అనుకున్నానని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి’ పలుకులు పేరుతో ఆయన యువ దర్శకులకు పాఠాలు చెప్పడంతో పాటు, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. తాజాగా సురేశ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

‘‘నేను సురేశ్‌తో ‘మరో క్విట్‌ ఇండియా’ సినిమా చేశా. దాంట్లో వాణీ విశ్వనాథ్‌ కథానాయిక. చిన్న సినిమా కావటంతో ఖర్చు తగ్గించుకునేందుకు అందరం కలిసి చిన్న రూమ్‌లో సర్దుకుపోయేవాళ్లం. అందులోనే నేనూ, వాణీ విశ్వనాథ్‌, సురేశ్‌ ఉండేవాళ్లం. సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే, సురేశ్‌ కల్పించుకుని ‘ఈ అమ్మాయి(వాణీ విశ్వనాథ్‌)’తో జాగ్రత్తండీ కేరళలో ఒక వీధినే కొనేసింది. ఎందుకంటే ఇక్కడ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేస్తోంది’ అని సురేశ్‌ సరదాగా ఆటపట్టించేవారు. రాఘవేంద్రరావు నవ్విస్తే ఆనందపడతారు. సురేశ్‌ నవ్వించి ఆనందపడతారు. సురేశ్‌ సెట్లో ఉన్నాడంటే ఒకటే నవ్వులు. అతని డ్యాన్స్ గమనిస్తే సురేశ్‌ బాడీలోనే డ్యాన్స్ ఉంటుంది. కానీ, అతను ఎక్కువగా తమిళంలో సినిమాలు చేశారు. అవే సినిమాలు వరుసగా తెలుగులోకి  చేసి ఉంటే, మరో శోభన్‌బాబు అయ్యేవారు. వాణీ విశ్వనాథ్‌ - సురేశ్‌ డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తుంటే అదే ‘టేక్‌’లా ఉండేది. ఆ తర్వాత సురేశ్‌ మాతో ‘తోడికోడళ్ళు’ చిత్రం చేశారు’’

‘‘తొలుత ఈ చిత్రంలో వెంకటేష్‌, రోజా, మీనా, శారదలు నటించాల్సి ఉంది. చిన్న సినిమా కావడంతో వాళ్లు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఈ సినిమాకి బోయిన సుబ్బారావు దర్శకత్వం చేశారు. కథను సరిగ్గా జడ్జి చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. రామానాయుడు కథ విని బాగుందంటే ఇక దానికి తిరుగుండదు. ‘తోడికోడళ్ళు’ కథని తమిళంలో శివాజీ గణేష్ తనయుడు ప్రభు రీమేక్‌ చేసుకున్నారు. చాలా బాగా ఆడింది. ఏదైనా సరే ‘ఫస్ట్ థాట్‌ ఈజ్‌ బెస్ట్‌ థాట్‌’ అని అన్న ఎన్టీఆర్‌ కూడా అనేవారు’’

‘‘మరో క్విట్‌ ఇండియా’ చిత్రానికి తొలుత అనుకున్న కథ ప్రకారం అన్యాయాలు, అక్రమాలు చేసేవారిని స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో సురేశ్‌ అంతం చేస్తుంటారు. భగత్‌సింగ్‌‌, అల్లూరి సీతారామరాజు గెటప్‌లన్నీ సురేశ్‌ వేయించాం. అది అందరికి నచ్చింది. కానీ, ఆ తర్వాత కథ మారిపోయింది. గాంధీ పాత్ర ఎంటర్‌ అయింది. పరుచూరి.. గాంధీ గురించి చెప్పడం ఏంటనేది కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. సినిమా విజయం సాధించలేదు. అయితే, ఆ తర్వాత సురేశ్‌ నటించిన ‘తోడికోడళ్ళు’ బాగా ఆడింది. ఇందులో నటించిన వాళ్లంతా చిన్న చిన్నవాళ్లే అయినా బాగా చేశారు. ఇటీవల బాలకృష్ణ సినిమాలో సురేశ్‌ ప్రతినాయకుడిగా నటించారు. సురేశ్‌ కూడా ఇప్పుడు కొత్త పాత్రలు వేయాలి. ముఖ్యంగా నరేశ్‌, రాజేంద్ర ప్రసాద్, ఆమనిలు బాగా రాణిస్తున్నారు. వారిలా సురేశ్‌ కూడా ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. కొత్త పాత్రల్లో నటించి రాణించాలని కోరుకుంటున్నా’’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని