Paruchuri: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటే ఇలా ఉండాలనిపించే సినిమా ‘ఐరావతం’!

ఓటీటీ వేదికగా విడుదలైన ‘ఐరావతం’(Iravatham) సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) విశ్లేషించారు. సినిమా బాగుందని అందరూ చూడాలని ఆయన కోరారు. 

Published : 16 Jan 2023 09:57 IST

హైదరాబాద్‌: అమర్‌దీప్(Amardeep)‌, తన్వి, అరుణ్‌, ఎస్తేర్‌ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఐరావతం’(Iravatham). గతేడాది ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. సుహాస్‌ మీరా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. పరుచూరి పాఠాలు(Paruchuri Paataalu)లో భాగంగా ఈ సినిమాని ఆయన విశ్లేషించారు. ఈ చిత్రంలో ఎస్తేర్‌(Ester) తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అద్భుతంగా నటించిందని ప్రశంసించారు.

ఇక హీరోగా నటించిన అమర్‌దీప్‌ బుల్లితెరపై మెప్పించినట్లే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాలోనూ బాగా చేశారన్నారు. చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నారని మెచ్చుకున్నారు. ఇద్దరు మనుషులను ఒక ఆత్మ వేధిస్తుంటే దాని నుంచి ఎలా బయటపడ్డారనే ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా అలరించిందన్నారు. కథ అల్లిన తీరు బాగుందని చెప్పారు. ఈ సినిమాతో దర్శకుడు సుహాస్‌ మంచి ప్రయత్నం చేసి విజయం సాధించారన్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర సినిమాకు మంచి ప్లస్‌ అయిందని.. సన్నీ, మాయ, శ్లోక, ప్రిన్సీ ఈ నాలుగు పాత్రలు కథకు బలాన్నిచ్చాయన్నారు.  చిత్రంలో కొన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయన్నారు. ‘ఐరావతం’ అంటే తెల్లటి ఏనుగని ఈ సినిమా కథ అంతా తెల్లటి కెమెరా ఆధారంగానే సాగుతుందని అందుకే ఈ పేరు పెట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో ఉన్న రహస్యమంతా ఆ కెమెరాలోనే ఉంటుందని ఆ విషయాన్ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం బాగుందన్నారు.

ఒక చిన్న అబ్బాయితో కథ చెప్పించడం గొప్ప సాహసమన్నారు. మాయ అనే ఆత్మ ఈ చిన్న పిల్లాడిలోకి దూరి తన కథను బయటపెట్టే ప్రయత్నం చేసిందేమో అనిపించిందన్నారు. ఆ పిల్లాడి పాత్ర ద్వారానే దర్శకుడు ఈ సినిమా చివర్లో పార్ట్‌2 కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చాడని తెలిపారు. క్లైమాక్స్‌కు ముందు సప్తగిరి నటన ఆకట్టుకుందన్నారు. థియేటర్లో విడుదలైతే కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి కేకలు వినిపించేవని తెలిపారు. ప్రేక్షకులను అలా భయపెట్టేలా సినిమా తీయడం కత్తి మీద సాము లాంటి విద్య అని.. అందులో దర్శకుడు అద్భుతంగా విజయం సాధించాడని పొగిడారు. హంతకుడు ఎవరు? అనే సస్పెన్స్‌ను చివరి వరకు కొనసాగించిన తీరు బాగుందన్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలా తీయాలి అంటే..ఇలా తీయాలని చెప్పేలా ఈ సినిమా ఉందన్నారు. అందరూ ఈ సినిమా చూడాలని పరుచూరి గోపాలకృష్ణ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని