Ponniyin Selvan: ఓటీటీలోకి వచ్చేసిన మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

విక్రమ్‌, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్యా రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. చోళ సామ్రాజ్య రాజులు, వారు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.   

Published : 28 Oct 2022 11:53 IST

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). చోళుల సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో దీన్ని రూపొందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది విడుదలైంది. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక, నవంబర్‌ 4 నుంచి  ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు అందరూ ఈ సినిమాను చూడొచ్చని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ పేర్కొంది.

కథ ఏంటంటే..

త‌మిళ‌నాట అత్యంత పాఠ‌కాద‌ర‌ణ పొందిన న‌వ‌ల ‘పొన్నియిన్ సెల్వన్‌’. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన ఈ న‌వ‌ల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. చోళ చ‌క్రవ‌ర్తి సుంద‌ర చోళుడు (ప్రకాశ్‌రాజ్‌) చివ‌రి రోజుల్లోని క‌థ ఇది. ఆయ‌నకు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్‌), అరుణ్‌మొళి వ‌ర్మన్ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జ‌యం ర‌వి), ఒక కుమార్తె కుంద‌వై (త్రిష‌). ఇద్దరు కుమారులూ కంచి, శ్రీలంకలో యువ‌రాజులుగా కొన‌సాగుతుంటారు. కుంద‌వై తండ్రి చెంత‌నే ఉంటుంది. తన తండ్రి సామ్రాజ్యంలో ఏదో జరుగుతుందని గ్రహించిన ఆదిత్య కరికాలన్‌.. అదేమిటో తెలుసుకుని రమ్మని వందియదేవన్‌ (కార్తి)ను తంజావురుకు పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన వందియదేవన్‌.. ఇతర సామంతులతో కలిసి ఆర్థిక మంత్రి పళవేట్టురాయర్‌ (శరత్‌కుమార్‌) పన్నిన కుట్రని ఎలా కనిపెట్టాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో నందిని ఎవరు? ఆమెకు, పొన్నియిన్ సెల్వన్‌కీ, ఆదిత్య క‌రికాల‌న్‌కీ ఉన్న సంబంధ‌మేమిటి? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిందని అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని