Prabhas: ఈ సినిమా విషయంలో డార్లింగ్స్‌ అని పిలవను: ప్రభాస్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా ప్రభాస్‌ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

Updated : 08 May 2023 22:22 IST

హైదరాబాద్‌: డార్లింగ్స్‌ అని ముద్దుగా పిలుస్తూ అభిమానుల్లో జోష్‌ నింపే హీరో.. ప్రభాస్‌ (Prabhas). తన ప్రతి సినిమా వేడుకలో డార్లింగ్స్‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించే ఆయన ‘ఆదిపురుష్‌’ (Adipurush) విషయంలో అలా పిలవనని ఫ్యాన్స్‌కు చెప్పారు. దానికి బదులుగా ‘జై శ్రీరామ్‌’ అని అంటానన్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో నిర్వహించిన ఆ సినిమా ట్రైలర్‌ (Adipurush Trailer) ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడారు. కొందరు అభిమానులు డార్లింగ్‌.. డార్లింగ్‌ అంటూ ప్రాంగణాన్ని హోరెత్తిస్తూ.. మరికొందరు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేయడంతో.. ఈ చిత్రం వరకు ‘జై శ్రీరామ్’ అందామని ఆయన అన్నారు. అది భక్తి ప్రధాన సినిమాకావడం వల్ల ప్రభాస్‌ అలా చెప్పారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను ఎంపిక చేసి.. మీడియా, పలువురు అభిమానుల కోసం ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. ఆ ఈవెంట్‌కు ప్రభాస్‌తోపాటు కథానాయిక కృతిసనన్‌, దర్శకుడు హాజరై సందడి చేశారు. ట్రైలర్‌ బాగుందంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. సంబంధిత ఫొటోలు/వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ట్రైలర్‌ మే 9న ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌.. రాఘవగా, కృతిసనన్‌.. జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌.. లంకేశ్‌గా నటించారు. 3డీ వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్‌ 13న ప్రతిష్ఠాత్మక ట్రిబెకా ఫెస్టివల్‌ (న్యూయార్క్‌)లో ప్రదర్శితం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని