MAA Election: మాది ఆవేదనతో పుట్టిన ప్యానల్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో

Updated : 25 Jun 2021 13:28 IST

మాది ‘సినిమా బిడ్డల ప్యానల్‌’
సభ్యులందరూ కష్టాలుపడ్డవారే
‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌రాజ్‌ మీడియా సమావేశం 

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. సెప్టెంబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానల్‌ని ప్రకటించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘‘నాలుగైదు రోజుల నుంచి మీడియాలో వస్తోన్న ఊహాగానాలు చూస్తుంటే కొంచెం భయం వేసింది. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ కొన్నిచోట్ల వార్తలు వచ్చాయి. ‘మా’లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నాను. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానల్‌లో ఎవర్నీ తీసుకోవాలి? చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను’’

‘మాది సినిమా బిడ్డల ప్యానల్‌. పదవీ కోసం మేము పోటీ చేయడం లేదు. పనిచేయడం కోసం పోటీచేస్తున్నాం. నా ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్లే. ఆఖరికి తప్పు చేస్తే నన్ను కూడా వాళ్లు ప్రశ్నిస్తారు. ఆ అర్హత వాళ్లకు ఉంది. మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున.. ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన.. అసోసియేషన్‌ని అభివృద్ధి చేయడమే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్‌, నాన్‌లోకల్‌ అని వింటున్నాను. కళాకారులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇదేం అజెండా. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ‘మా’ ఎంతో బలమైన అసోసియేషన్‌. ఇది కోపంతో పుట్టిన ప్యానల్‌ కాదు. ఆవేదనతో పుట్టింది. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. ఇది ఎంతో క్లిష్ట సమయం. మన గృహాన్ని ఇకపై మరింత పరిశుభ్రం చేసుకోవాలి. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు