Priyanka Chopra: ఆ క్షణం ఎంతో ప్రత్యేకం.. తాళి గురించి ప్రియాంక చోప్రా ఏమందంటే?

‘‘మంగళసూత్రం వేసుకున్న క్షణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అది నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రియాంక చోప్రా చెప్పారు.

Published : 19 Jan 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మంగళసూత్రం మెడలో పడిన క్షణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అది నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రియాంక చోప్రా చెప్పారు. ఇటలీ దేశానికి చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్‌కి వెళ్లిన ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మంగళసూత్రం కట్టించుకున్న మధురక్షణం నాకెప్పటికీ ప్రత్యేకమే. నేను దాని విలువేంటో తెలుసుకుంటూ పెరిగా. అదే సమయంలో ఓ ఆధునిక మహిళగా దాని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నా. తాళిని మనం ఇష్టపడి కట్టించుకుంటున్నామా? పూర్వకాలం నుంచి అలా వచ్చిందా? అనేది పక్కనబెడితే నేను రెండు తరాలకు చెందినదాన్ని. సంప్రదాయాన్ని పాటిస్తూనే ఆధునిక మహిళగా రాణించాలి. సంప్రదాయాన్ని వదిలేయకుండా.. మీరెవరో? దేనికోసం పోరాడుతున్నారో తెలుసుకోండి. తరువాతి తరం అమ్మాయిలు ఎంత విభిన్నంగా ఉంటారో మనం చూస్తాం’’ అని పేర్కొన్నారు.

గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. అమెరికా పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. 2017లో వీరి మధ్య ప్రేమ చిగురించగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘మ్యాట్రిక్స్‌ 4’తో అలరించిన ప్రియాంక ‘సీటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇండియా, ఇటలీ, మెక్సికోకు చెందిన నిర్మాణ సంస్థలు ఈ అంతర్జాతీయ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. రూసో బ్రదర్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీ లే జరా’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్‌లో సందడి చేయబోతున్నారు. ఆలియాభట్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో ఫర్హాన్‌ అక్తర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని