Aswini dutt: సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది.. అశ్వినీదత్‌ సంచలన వ్యాఖ్యలు

సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాల్‌గా మారిందని, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు.

Updated : 28 Jul 2022 17:44 IST

హైదరాబాద్‌: సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం ఇప్పుడొక సవాల్‌గా మారిందని, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం తీరుపైనా మండిపడ్డారు.

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా అశ్వినీదత్‌ మండిపడ్డారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆయన వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని వివరించారు. ప్రస్తుతం తిరుపతిలో జరగని పాపం అంటూ లేదని, ప్రభుత్వం మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని విమర్శించారు. స్వామి ఇంకా పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదని అశ్వినీదత్‌ విచారం వ్యక్తం చేశారు.

ఇక ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదలపై కూడా అశ్వినీదత్‌ స్పందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరితో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని, గ్రాఫిక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. అవెంజర్స్‌ మూవీ స్థాయిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉంటుందని అశ్వినీదత్‌ చెప్పారు.

‘సీతారామం’ మరో గీతాంజలి అవుతుంది!

‘‘సీతారామం’ కథ చెప్పినప్పుడు నచ్చింది. స్వప్నతో ముందుకు వెళ్లొచ్చు అని చెప్పా. కెమెరాతో మ్యాజిక్‌ చేశారు. ప్రతి షాట్‌ అబ్బా అనిపిస్తుంది. హనులో ఓ వీక్‌నెస్‌ ఉంది. తనకు తెలియకుండానే సీన్‌ను లాగుతుంటాడు. నాకు సంగీతంపై పరిజ్ఞానం దేవుడిచ్చిన వరం. ట్యూన్‌ అనగానే పసిగడతాను. బాగుంటే ఓకే.. లేకపోతే అక్కడే ఆపేస్తాను. మణిశర్మతో సన్నిహితం ఎక్కువ. హనురాఘవపూడి బాగా కష్టపడ్డారు. ‘మహానటి’లో జెమినీ గణేషన్‌ పాత్ర కోసం దుల్కర్‌ సల్మాన్‌ను ఎన్నుకున్నప్పటి నుంచి ఆయనంటే గౌరవం ఏర్పడింది. దుల్కర్‌తో ఏడాదిన్నరకో సినిమా చేద్దామని స్వప్నకు చెప్పా. అనుకోకుండా ఈ సినిమాకు అవకాశం వచ్చింది. ఈ కథకు ఆయనే సరైన హీరో. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ఇంత ఖర్చు పెట్టడం సమంజసమేనని మీరే అంటారు. ఈ సినిమాకు ఖర్చు పెట్టక తప్పదు. ఇది మరోచరిత్ర, గీతాంజలిలాగా ల్యాండ్‌మార్క్‌ సినిమా అవుతుంది’’ అని అశ్వినీదత్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని