Nagababu: ‘ఆరెంజ్‌’ రీ రిలీజ్‌.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం

‘ఆరెంజ్‌’ (Orange) సినిమా రీ రిలీజ్‌ విషయంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు నటుడు నాగబాబు (Nagababu). ఈ సినిమాకు వచ్చే ప్రతి రూపాయినీ జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Published : 23 Mar 2023 17:50 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘ఆరెంజ్‌’ (Orange). చెర్రీ బర్త్‌డేని పురస్కరించుకుని దీన్ని రీ రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీ రిలీజ్‌ కలెక్షన్స్‌ విషయంలో చిత్ర నిర్మాత, జనసేన నేత నాగబాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు వచ్చే డబ్బు మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వినోదమే కాకుండా..  పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ  మెగా అభిమానులు, జన సైనికులకు పిలుపునిస్తూ గురువారం ఆయన ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

రామ్‌చరణ్‌ - జెనీలియా జంటగా ‘ఆరెంజ్’ తెరకెక్కింది. భాస్కర్‌ దీనికి దర్శకత్వం వహించగా.. నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో అంచనాల మధ్య 2010లో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తోన్న రీ రిలీజ్‌ల ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘ఆరెంజ్‌’ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజుకు ముందు మార్చి 25, 26 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని