ఆ పరిశ్రమ నన్ను బ్యాన్‌ చేసింది..!

‘మీటూ’ ఆరోపణలు చేసినందుకు కోలీవుడ్‌ ఇండస్ట్రీ తనని బ్యాన్‌ చేసిందని ప్రముఖ గాయని చిన్మయి అన్నారు. అయితే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా సరే అర్థం చేసుకుని వెన్నంటే ఉండే రాహుల్‌ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని...

Published : 13 Mar 2021 10:25 IST

ప్రముఖ గాయని చిన్మయి

చెన్నై: ‘మీటూ’ ఆరోపణలు చేసినందుకు కోలీవుడ్‌ ఇండస్ట్రీ తనని నిషేధించిందని ప్రముఖ గాయని చిన్మయి అన్నారు. అయితే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా సరే అర్థం చేసుకుని వెన్నంటే ఉండే రాహుల్‌ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని ఆమె తెలిపారు. తన పాటలు, మాటలతో దక్షిణాది పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి తాజాగా ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌’లో ముచ్చటించారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు.

‘‘మీటూ’ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లను బయట పెట్టినందుకు 2018 అక్టోబర్‌ నుంచి రాధారవి, వైరముత్తు.. కోలీవుడ్‌ పరిశ్రమలో నన్ను బ్యాన్‌ చేశారు. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. నేను దీనిపై చట్టబద్ధంగా పోరాడుతున్నాను. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని‌ చేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే మంచి భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం. మరి, అండగా నిలిచే కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏమిటి?’’ అని చిన్మయి ప్రశ్నించారు. ప్రముఖ సింగర్‌ కార్తిక్‌, వైరముత్తులు తనని మానసిక  వేధింపులకు గురి చేశారని 2018లో చిన్మయి చేసిన ఆరోపణలు అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ‘మీటూ’లో భాగంగా సోషల్‌మీడియా వేదికగా ఆమె చేసిన ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని