Chiranjeevi: చిరంజీవి- రాధికా కాంబో.. మరోసారి

చిరంజీవి, రాధిక కలిసి ఓ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఆ ప్రాజెక్టు వివరాలు తెలియాలంటే ఈ కథనం చదివేయండి...

Updated : 01 May 2022 21:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘న్యాయం కావాలి’, ‘యమకింకరుడు’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మొండిఘటం’, ‘ప్రేమ పిచ్చోళ్లు’, ‘పల్లెటూరి మొనగాడు’, ‘అభిలాష’, ‘గూఢచారి నం. 1’, ‘హీరో’, ‘ఆరాధన’, ‘రాజా విక్రమార్క’ తదితర చిత్రాల్లో కలిసి నటించి సూపర్‌హిట్‌ జోడీ అనిపించుకున్నారు చిరంజీవి, రాధికా శరత్‌కుమార్‌. ఈ ఆసక్తికర కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతుంది. అయితే, నాయకానాయికలుగా మాత్రం కాదు. చిరు హీరోగా.. రాధిక నిర్మాతగా ఆ సినిమా రానుంది. తాను తెలుగులో నిర్మించాలనుకుంటున్న ఓ ప్రాజెక్టులో చిరంజీవి హీరోగా నటించేందుకు అంగీకరించారని, సమీప భవిష్యత్తులో అది కార్యరూపం దాల్చనుందని సోషల్‌ మీడియా వేదికగా రాధిక ఆనందం వ్యక్తం చేశారు. తన నిర్మాణ సంస్థలో నటించేందుకు ఓకే చెప్పిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఎవరు? ఎలాంటి నేపథ్యమున్న కథ? హీరోయిన్‌ తదితర వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

నటిగానే కాకుండా రాధిక నిర్మాతగానూ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాడాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన ధారావాహికలు నిర్మించిన ఆమె తమిళంలో పలు సినిమాలు రూపొందించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి జోష్‌ పెంచారు. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తోంది. మరోవైపు, ‘గాడ్‌ ఫాదర్’, ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంతో బిజీగా ఉన్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులను త్వరలోనే ప్రకటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని