Rajamouli: ఇది ‘హిట్‌’ సీజన్‌ అని అందరికీ తెలియాలి: రాజమౌళి

‘హిట్‌ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

Published : 28 Nov 2022 22:51 IST

హైదరాబాద్‌: అడివి శేష్‌ (Adivi Sesh), మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ (Hit 2). నాని నిర్మాత. గతంలో వచ్చిన ‘హిట్‌’కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకనుద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘రెండు నెలల నుంచి ఇంగ్లిష్‌లో మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉంది. ‘హిట్‌’కు పలు సీక్వెల్స్‌ చేయడమంటే కష్టం. ఈ విషయంలో దర్శకుడు శైలేష్‌, నిర్మాతలు నాని, ప్రశాంతికి అభినందనలు. ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. సినిమాపై ఉత్సుకత పెంచడంలో శైలేష్‌ విజయం సాధించాడు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘హిట్‌ 3’, ‘హిట్‌ 4’, ‘హిట్‌ 5’.. ఇలా హిట్‌ సిరీస్‌ చిత్రాలన్నీ ఒకే సీజన్‌లో రావాలి. ‘ఇది హిట్‌ సీజన్‌’ అని అందరికీ అర్థమైపోవాలి. అది సాధ్యమవుతుందనుకుంటున్నా’’ అని రాజమౌళి అన్నారు.

‘‘అష్టాచమ్మా’ నుంచి ‘దసరా’ వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నాని నాతోసహా అందరికీ నచ్చుతారు. రాజమౌళి ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఏదైనా నేర్చుకునే విషయంలో నిత్య విద్యార్థిగా ఉండాలనేదాన్ని ఆయన్ను చూసే తెలుసుకున్నా. ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నా. సినిమాపై నాకు బాగా నమ్మకం ఉంది. అందుకే దీన్ని హిందీలోనూ విడుదల చేయబోతున్నాం’’ అని శేష్‌ తెలిపారు.

‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా ఫీలవుతున్నా. నేను పోషించిన ఆర్య అనే పాత్ర అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా సహనటుడు శేష్‌ చాలా మంచి వ్యక్తి. అతని కథల ఎంపిక ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే’’ అని మీనాక్షి చౌదరి పేర్కొంది. ‘‘హిట్‌’ సినిమా ప్రారంభానికి పది రోజుల ముందు నా సోదరుడు చనిపోయాడు. ఇక ఆపేయడమే అనుకున్నా. కానీ, అందరి ప్రోత్సాహం వల్ల షూటింగ్‌ చేయగలిగా. ఇది మా అన్నయ్య విన్న చివరి స్క్రిప్టు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా’’ అని శైలేష్‌ కొలను చెప్పారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని