Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వాన్ని నేను ఎలాంటి డిమాండు చేయలేదు: ఆర్జీవీ

సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

Published : 11 Jan 2022 01:27 IST

అమరావతి: సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు. ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదని అన్నారు.

‘‘మంత్రి పేర్ని నానితో జరిగిన భేటీలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించాం. టికెట్‌ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీరంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తా. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. టికెట్‌ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్లు ఆయన ఎదుట పెట్టలేదు. ఈ భేటీ ద్వారా వచ్చిన అభిప్రాయాలపై ఇద్దరం చర్చిస్తాం. తుది నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది.’’

‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గించిందనే వాదనతో నేను ఏకీభవించను. అయితే, ప్రభుత్వం నిర్ణయం స్టార్‌లందరిపైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది. కేవలం పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణను టార్గెట్‌ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. టికెట్‌ రేట్ల తగ్గింపు విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు విపులంగా ఉదాహరణలు చెప్పి అన్నీ వివరించా. కేవలం ఈ ఒక్క చర్చతోనే టికెట్‌ రేట్ల తగ్గింపు అంశం ముగిసిపోదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదు. ఒక సినిమా నిర్మాతగా మాత్రమే ఇక్కడ చర్చించడానికి వచ్చా. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్‌ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. సమస్య పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరిపైనా ఉంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తాజా చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా’’ అని వర్మ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని