Rambha: మీ ప్రార్థనలు ఫలించాయి.. మేమంతా క్షేమంగా ఉన్నాం: రంభ

‘‘ఇప్పటికీ మీరు నాపై అభిమానం చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు అమ్మాయిని. హైదరాబాద్‌ వస్తా’’ అని నటి రంభ అభిమానులతో చెప్పారు.

Published : 02 Nov 2022 18:43 IST

ఒట్టావా: తన చిన్న కుమార్తె సాషా సహా తామంతా క్షేమంగా ఉన్నామని నటి రంభ (Rambha) తెలిపారు. తాము క్షేమంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. సాషా ఆరోగ్యం మెరుగుపడిందని, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చామంటూ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారిగా ‘ఇన్‌స్టా’ లైవ్‌లో పాల్గొన్న రంభ తన అభిమాలనులతో కాసేపు ముచ్చటించారు. ‘‘ఇప్పటికీ మీరు నాపై అభిమానం చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు అమ్మాయిని. ఆంధ్రాలో పుట్టి, పెరిగా. నేను ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషను నేర్చుకుంటా. హైదరాబాద్‌ తప్పకుండా వస్తా’’ అని నటి అన్నారు.

కెనడాలోని ఒంటారియోలో స్థిరపడ్డ రంభ.. సోమవారం సాయంత్రం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా రంభ కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమార్తె సాషాకు గాయాలుకాగా ఆసుపత్రిలో చేర్చారు. అదే కారులో ప్రయాణించిన రంభ, మిగిలిన పిల్లలు, ఆయాకు స్వల్ప గాయాలయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా సంబంధిత ఫొటోలను పోస్ట్‌ చేసిన రంభ.. ‘‘దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యం’’ అని కోరారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’తో నటిగా మారిన రంభ 100కిపైగా చిత్రాల్లో నటించి అలరించారు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించిన రంభ వివాహానంతరం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని