Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్‌బీర్‌, రావణుడిగా యశ్‌..!

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా రానున్న రామాయణానికి సంబంధించి ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఈ సినిమాలోని నటీనటుల వివరాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Published : 08 Jun 2023 11:22 IST

హైదరాబాద్‌:  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్‌ తివారీ (Nitesh Tiwari), నిర్మాత మధు మంతెన (Madhu Mantena)లతో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై చాలా వార్తలు నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ను (Ranbir Kapoor) ఓకే చేశారట. ఆ పాత్ర కోసం లుక్‌ టెస్ట్‌లు కూడా చేసేశారని టాక్‌. అయితే, సీత పాత్ర కోసం అలియా భట్‌ (Alia Bhatt)ను ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా దర్శకుడు నితేశ్‌ తివారీతో అలియా భట్ (Alia Bhatt) కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలు వినిపించాయి. కానీ, సడెన్‌గా తెరపైకి అలియా వచ్చేసింది. ఆమెకు నితేశ్‌ తివారీ లుక్‌ టెస్ట్‌ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రావణుడిగా కేజీయఫ్‌ హీరో యశ్‌ (Yash)ను ఓకే చేశారని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం సినీప్రియులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ‘‘ఏ ఆధారం లేకుండా వాయిదా పడిందని ఎలా చెబుతారు..? ఇలాంటి రూమర్స్‌ సృష్టించకండి. మేము ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయకండి’’ అని అన్నారు. దీంతో మరో రామాయణం సిద్ధం కానుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రానుంది.

గతంలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అల్లు అరవింద్‌ మాట్లాడుతూ..‘‘నేను మరికొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని తీస్తున్నాను. దాని కోసం గత నాలుగు సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి తర్వాత ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం అంతా పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని