Ranbir Kapoor: తప్పుగా మాట్లాడితే మన్నించండి: రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - అలియాభట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)....

Updated : 08 Dec 2022 17:31 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - అలియాభట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేయగా.. అనుకోని కారణాల వల్ల అది రద్దైన సంగతి తెలిసిందే. దీంతో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈప్రెస్‌మీట్‌లో రణ్‌బీర్‌ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగులో మాట్లాడటం కోసం రణ్‌బీర్‌ మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడని అలియా తెలిపారు.

‘‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’. బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ కూడా ఇదే. మంచి చిత్రాన్ని ఎప్పుడూ ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా చిత్రం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన అక్కినేని, నందమూరి, రాజమౌళి అభిమానులందరికీ థ్యాంక్యూ. ‘బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 2’ సమయానికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటా. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి’’ అని రణ్‌బీర్‌ పేర్కొన్నారు. తన భర్త మొదటిసారి తెలుగులో మాట్లాడడంతో అలియా ఫిదా అయ్యారు. ఇక, రాజమౌళి అయితే అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.

‘‘ఆర్ఆర్‌ఆర్‌’లో నటించడం వల్ల నేనూ రాజమౌళి సర్‌ హీరోయిన్‌ అని చెప్పుకొనే అవకాశం లభించింది. మీరు హీరోలా నిలబడి మా చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు లేకపోతే ‘బ్రహ్మాస్త్ర’ పూర్తయ్యేది కాదు. అయాన్‌ మిమ్మల్ని ఎంతో అభిమానిస్తుంటాడు. అలాంటిది ఈరోజు మీరు ఆయన తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రానికి తారక్‌ సపోర్ట్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన మంచి మనసుకు ఇదొక నిదర్శనం’’ అంటూ అలియా ‘బ్రహ్మాస్త్ర’లోని ‘కుంకుమలా’ పాటను పాడి అలరించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని