Rashmika: ‘పుష్ప’కు కష్టపడితే.. ఈ చిత్రానికి విశ్రాంతి తీసుకున్నా: రష్మిక

రష్మిక.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఎంపిక చేసుకున్న పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

Published : 01 Mar 2022 09:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ భామ రష్మిక.. వరుస సినిమా అవకాశాలు, హిట్లతో దూసుకెళ్తోంది. ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. ఇటీవల, ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా సందడి చేసిన ఆమె ఇప్పుడు శర్వానంద్‌ సరసన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో ఆద్యగా అల్లరి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో ముచ్చటించింది. 

అక్కడ ఇంప్రెస్‌ అయ్యా.. 

దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ సినిమా స్క్రిప్టును కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌లో వినిపించారు. ఆ కథ, ఆయన చెప్పిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సన్నివేశం నాకు బాగా కనెక్ట్‌ అయింది. దాంతో ఈ చిత్రంలో ఎలా అయినా సరే నటించాలనుకున్నా. మహిళలకు అధిక ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో ఆయా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారా? అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. ఖుష్బూ, రాధికా, ఊర్వశీలాంటి సీనియర్‌ నటులు నటిస్తున్నారని తెలియగానే సంబరపడ్డా. వారితో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఓ నటిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.

అదీ నా పాత్ర..

నేనిందులో ఆద్య అనే పాత్ర పోషించా. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా వ్యవహరించే క్యారెక్టర్‌ అది. కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడుతుంది. నా పాత్రే కాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రా ప్రత్యేకంగా నిలుస్తుంది. సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.

నేనూ వారితో కలిసిపోయా..

‘పుష్ప’ సినిమాలో నటిస్తూనే ఈ చిత్రంలోనూ నటించా. ‘పుష్ప’ కోసం అడవుల్లో నటించి, ఈ సినిమా సెట్‌లో అడుగుపెడితే పిక్నిక్‌కు వచ్చినట్టు అనిపించేది. అక్కడ కష్టపడి ఇక్కడ విశ్రాంతి తీసుకునేదాన్ని. శర్వానంద్‌ చాలా మంచి వ్యక్తి. తన మా కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేవాడు. ఈ చిత్రంలో ఆడవాళ్లంతా శర్వాను ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసి ఈ డోస్‌ ఇంకాస్త పెంచా. మరి మేం పెట్టిన ఇబ్బంది ఏంటి? దాన్నుంచి శర్వా ఎలా బయటకు వచ్చారో సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

అది గొప్ప విషయం..

కిశోర్‌కు దైవభక్తి ఎక్కువ. చాలా సరదాగా ఉంటారు. ఆయనతో మాట్లాడితే మన మోముల్లో చిరునవ్వు చిందాల్సిందే. పని విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. మహిళలకు ఆయన ఎంత విలువిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్, హీరోయిజం హంగులతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో మహిళల కోసమే ఓ చిత్రం తెరకెక్కించడం గొప్ప విషయం.

మరోసారి నటించానుంది..

ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంది శ్రీ లక్మి వేంకటేశ్వర సినిమాస్‌ సంస్థ. మరోసారి ఈ సంస్థలో పనిచేయాలనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నా. ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కీర్తి సురేశ్‌, సాయి పల్లవి, సుకుమార్‌గారు హాజరవడం చాలా ఆనందంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని