Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్‌ ఇచ్చి

నటిగా తనకు అవకాశం ఇచ్చిన పరంవా స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ గురించి ఏం మాట్లాడలేదని గతంలో విమర్శలు ఎదుర్కొన్న రష్మిక.. తాజా ఇంటర్వ్యూలో ఆ సంస్థ గురించి చెప్పారు.

Published : 23 Mar 2023 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప’ (Pushpa) సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటి రష్మిక (Rashmia). ప్రస్తుతం ఆమె దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన కెరీర్‌ ఎలా మొదలైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty)కి చెందిన పరంవా స్టూడియోస్‌ వల్లే తాను నటిగా మారానని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి.

‘‘నేను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు అలా ఊహించుకోలేదు కూడా. కాకపోతే సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. కొన్ని సినిమా ఆడిషన్స్‌కు కూడా వెళ్లేదాన్ని. నిరాశతో వెనక్కి వచ్చేదాన్ని. నటన అనేది నాకు సెట్‌ కాదని, అది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో నేనొక అందాల పోటీలో పాల్గొని.. టైటిల్‌ సొంతం చేసుకున్నా. నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దానిని చూసి పరంవా స్టూడియోస్‌ (రక్షిత్‌ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ) నుంచి కాల్‌ వచ్చింది. తాము తెరకెక్కిస్తోన్న ‘కిరిక్‌ పార్టీ’లో రోల్‌ ఆఫర్‌ చేశారు దర్శక- నిర్మాతలు. అలా, నటిగా నా తొలి అడుగు పడింది’’ అని రష్మిక తన ఎంట్రీని గుర్తుచేసుకున్నారు.

గతేడాదిలో బాలీవుడ్‌ మీడియాతో రష్మిక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. తనకు మొదటి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు చెప్పడానికి ఆసక్తి కనబర్చలేదు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస సినిమాలు చేస్తున్నందు వల్ల రష్మికకు గర్వం పెరిగిందని.. అందుకే మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడం లేదని నెటిజన్లు కొంతకాలంపాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక, రక్షిత్‌శెట్టి ప్రేమించుకుని.. నిశ్చితార్థం కూడా చేసుకుని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని