Rashmika: రష్మికపై కన్నడిగుల ఆగ్రహం.. ఆమెపై బ్యాన్‌ అంటూ వార్తలు

నటి రష్మికపై కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన తమకు నచ్చలేదని అంటున్నారు 

Published : 26 Nov 2022 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్రకథానాయిక రష్మికపై (Rashmika) కర్ణాటకలోని సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెలో కృతజ్ఞతభావం లేదని, ఆమె నటించిన చిత్రాలు చూడాలనుకోవడం లేదని ట్వీట్స్‌ పెడుతున్నారు. మరోవైపు ఆమెపై బ్యాన్‌ విధించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కన్నడిగుల ఆగ్రహానికి కారణం ఏమిటి? రష్మికపై బ్యాన్‌ అంటూ వస్తోన్న వార్తల్లో నిజమెంత?

‘పుష్ప’ (Pushpa) తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటి రష్మిక. దాదాపు నెల క్రితం ఆమె ఓ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. కాలేజీ స్టూడెంట్‌ నుంచి నటిగా ఎలా మారిందో తెలిపింది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పింది. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా (Paramvah) నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.

ఇదిలా ఉండగా, ‘కాంతార’(Kantara) సక్సెస్‌ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి (Rishab Shetty) రష్మికపై పరోక్షంగా సెటైర్‌ విసిరాడు. ‘సాయిపల్లవి, సమంత, రష్మిక.. వీరిలో ఎవరితో నటించాలనుకుంటున్నారు?’ అని విలేకరి ప్రశ్నించగా ‘సాయిపల్లవి, సమంత నటన అద్భుతంగా ఉంటుంది. వాళ్లతో చేయాలని ఉంది’ అంటూనే కొంతమందితో తాను సినిమాలు చేయాలనుకోవడం లేదని విమర్శించాడు. రిషబ్‌ వీడియో వైరల్‌గా మారిన తరుణంలో.. నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా ఆమె పొగరుగా వ్యవహరించారు కాబట్టే ఆయన ఈవిధంగా కామెంట్స్‌ చేశాడని.. ఇందులో తప్పు లేదని పేర్కొంటూ పలువురు నెటిజన్లు ఆ వీడియోలు షేర్‌ చేశారు.

బ్యాన్‌ అంటూ వార్తలు..!

రష్మిక-రిషబ్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో కన్నడ ప్రాంతానికి చెందిన పలువురు సినీ ప్రియులు నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెలో కృతజ్ఞత భావం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే రష్మికపై కర్ణాటక సినీ పరిశ్రమలో బ్యాన్‌ విధించనున్నారంటూ కొన్ని ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆంగ్ల పత్రికల్లో వస్తోన్న కథనాలతో ఈ వదంతులకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. మరోవైపు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె అభిమానులు అంటున్నారు.

నిర్మాణ సంస్థ పేరు అందుకే చెప్పలేదా..?

రిషబ్‌ శెట్టి తెరకెక్కించిన ‘కిరిక్‌ పార్టీ’తో రష్మిక నటిగా పరిచయమయ్యారు. రిషబ్ స్నేహితుడు, నటుడు రక్షిత్‌ శెట్టికి జోడీగా ఆమె నటించారు. రక్షిత్‌కు చెందిన ‘పరంవా’ బ్యానర్‌పైనే ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా తర్వాత రష్మిక-రక్షిత్‌కు నిశ్చితార్థమైంది. అనుకోని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ‘పరంవా’ సంస్థ పేరు చెప్పకపోవడానికి ఈ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని