RRR: హైదరాబాద్‌ చేరుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.. రాజమౌళిని చుట్టుముట్టిన అభిమానులు

ఆస్కార్‌ వేడుకల అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానుల హంగామాతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం రద్దీగా మారింది.

Published : 17 Mar 2023 09:44 IST

హైదరాబాద్‌: ‘ఆస్కార్‌’ (oscars 2023) అవార్డు సాధించిన అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి (Rajamouli), ఆయన సతీమణి రమ, కీరవాణి (Keeravani), ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహా, తదితరులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి కనబరిచారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో మాట్లాడేందుకు పలువురు విలేకర్లు ప్రయత్నించగా.. ‘జైహింద్‌’ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దేశ రాజధానికి చరణ్‌..!

నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సైతం శుక్రవారం స్వదేశానికి రానున్నారు. అయితే ఆయన నేరుగా హైదరాబాద్‌కు రావడం లేదు. ఈ రోజు సాయంత్రం వరకూ ఆయన దేశ రాజధాని దిల్లీలో ఉండనున్నారు. ఉదయం ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో అతిథిగా పాల్గొననున్నారు. సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ఈ రోజు రాత్రికి ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అభిమానులు తెలిపారు. చరణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని