SaiDharam Tej: అమ్మా నన్ను క్షమించు.. సాయితేజ్‌ ఎమోషనల్‌

సాయిధరమ్‌ తేజ్‌, కార్తిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. తాజాగా ఈసినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయితేజ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Published : 07 Dec 2022 14:55 IST

హైదరాబాద్‌: బైకు ప్రమాదం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) నటించిన సరికొత్త చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తిక్‌ దర్శకుడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ బుధవారం విడుదలైంది. తారక్‌ (NTR) వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ టైటిల్‌ గ్లింప్స్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి తేజ్‌ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లికి క్షమాపణలు చెప్పారు.

‘‘నేను ఈ స్టేజ్‌పై నిల్చొనేలా చేసి, నాకు ఓర్పు, సహనం నేర్పించిన మా ముగ్గురు మావయ్యలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. వాళ్ల ప్రేమాభిమానం వల్లే నేను ఇక్కడ ఉన్నా. అమ్మా.. ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నప్పుడు నీకో విషయం చెప్పలేకపోయా.. ఇప్పుడు చెబుతున్నా.. ‘ఐ యామ్‌ సారీ, అలాగే లవ్‌ యూ అమ్మా’. నేను ఈ సినిమా చేసింది, ఇంత కష్టపడింది నీకోసమే. డియర్‌ తారక్‌.. 2007లో మొదటిసారి నిన్ను కలిసినప్పుడు ఎంత ప్రేమను చూపించావో ఇప్పటికీ అలాగే నన్ను ప్రేమగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన సాయాన్ని మాటల్లో వర్ణించలేను. ఎవరు ఏమైనా అనుకోని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సాయి తేజ్‌ తెలిపారు.

ఇది మూఢ నమ్మకాలకు సంబంధించిన చిత్రం కదా. చిన్నప్పుడు మీరు నమ్మిన మూఢ నమ్మకం ఏమిటి?

సాయితేజ్‌: మూఢ నమ్మకం అని కాదు. చిన్నప్పటి నుంచి నేను ఆంజనేయస్వామిని నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉంటారని భావిస్తాను.

బైకు ప్రమాదం తర్వాత మీరు నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం మీరు ఎంతలా కష్టపడ్డారు?

సాయితేజ్‌: ప్రమాదం చిన్నదే అయినప్పటికీ.. దాని ప్రభావం నాపై ఎక్కువగా పడింది. దాని నుంచి కోలుకోడానికి సుమారు ఆరు నెలలు సమయం పట్టింది. దర్శకుడు కార్తిక్‌.. కథతోపాటు నా పాత్ర ఎలా ఉంటుంది?ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? ఇలా ప్రతీది ఎంతో క్షుణ్ణంగా వివరించాడు.

‘విరూపాక్ష’ అంటే కనిపించని మూడోకన్ను అన్నారు. చిరంజీవి నటించిన ‘త్రినేత్రుడు’తో దీనికి ఏదైనా సంబంధం ఉందా?

కార్తిక్‌: అలా ఏమీ లేదు. రెండూ విభిన్నమైన కథలు.

మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండనున్నాయి?

సాయితేజ్‌: ప్రేక్షకులకు మంచి థియేటర్‌ అనుభవాన్ని అందించడం కోసం కష్టపడుతున్నాను.

నిర్మాత ప్రసాద్‌తో మీరు వరుస సినిమాలు చేస్తున్నారు కదా. తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్‌లోనా?

సాయితేజ్‌: అవును. నా తదుపరి ప్రాజెక్ట్‌ ఆయనతోనే చేస్తున్నా. ఆయనను, బాపి అన్నయ్యను వదిలే ప్రసక్తే లేదు.

ఎన్టీఆర్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలనే ఆలోచన ఎవరిది?

సాయితేజ్‌: టీమ్‌ అందరిది. మేమంతా అనుకొని, ఈ డైలాగ్‌కు తారక్‌ వాయిస్‌ సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాం. ఆయన్ని కలిశాం. ఆయన వెంటనే ఓకే అన్నారు.

పాన్‌ ఇండియా మార్కెట్‌లోకి మీరు కూడా ప్రవేశిస్తున్నారని అనుకోవచ్చా?

సాయితేజ్‌: ఇది యూనివర్సల్‌ స్క్రిప్ట్‌. అందుకే దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు.

ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు?

సాయితేజ్‌:  2018లోనే ఈ కథ విన్నా. అప్పటికి వేరే సినిమా షూట్‌లో ఉండటం వల్ల కాస్త లేట్‌ అయ్యింది. మధ్యలో కరోనా, తర్వాత చిన్న ప్రమాదం.. దాని వల్ల షూట్‌ ఆలస్యంగా ప్రారంభించాం.

వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తీశారా? 

కార్తిక్‌: పేపర్లో ఎన్నో కథనాలు చదివాను. అందులో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది. దానిని ఆధారంగా చేసుకుని ఈ ఫిక్షనల్‌ కథ రాశా.

మీ సినిమాలో మళ్లీ సాంగ్‌ రీమేక్‌ చేస్తారా?

సాయితేజ్‌: సాంగ్స్‌ రీమేక్‌ చేయడం నేను ఎప్పుడో ఆపేశాను. దర్శకుడు కోరితే చేస్తాను తప్ప.. నా సొంతంగా అలాంటి ప్రయత్నాలు చేయను.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని