Sai Pallavi: అలా కనిపిస్తాను కాబట్టే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు: సాయి పల్లవి

తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా భయంగా ఉండేదని సాయి పల్లవి (Sai Pallavi) తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రేమమ్‌’ సినిమా ముందు రోజులను గుర్తు చేసుకుంది.

Published : 31 Mar 2023 14:52 IST

హైదరాబాద్‌: తన అందంతో, అభినయంతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది సాయిపల్లవి. శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ (Fidaa) సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తొలి చిత్రంతోనే అందరి మనసులు దోచేసింది. తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో తన వాయిస్‌ను, తన ముఖంపై ఉన్న మొటిమలను చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారోనని అనుకునేదాన్నని చెప్పింది. ‘ప్రేమమ్‌’ (Premam) సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలతో తనపై తనకు నమ్మకం కలిగిందని తెలిపింది.

‘‘నేను మొదట్లో చాలా భయపడ్డాను. ఏ పని చెయ్యాలన్నా సందేహించేదానిని. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకునేదానిని. నా వాయిస్‌, వస్త్రధారణ, ముఖంపై ఉండే మొటిమలు.. వీటన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనుకున్నా. కానీ ‘ప్రేమమ్‌’ దర్శకుడు నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఆ సినిమాకు ఎంపిక చేశారు. ఆ సినిమా విడుదలయ్యాక నాపై నాకు విశ్వాసం పెరిగింది. నన్ను తెరపై చూసినప్పుడు థియేటర్లో  ప్రేక్షకులు చప్పట్లు కొట్టిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో మేకప్‌ లేకుండానే నటించాను. దర్శకులు కూడా నన్ను మేకప్‌ వేసుకోమని బలవంతం చెయ్యలేదు. మేకప్‌ లేకుండా నటిస్తాను కాబట్టే నన్ను  ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు’’ అని సాయి పల్లవి చెప్పింది.

ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డు ఫంక్షన్‌లో సాయి పల్లవి మెరిసింది. గతేడాది విడుదలైన ‘గార్గి’ (Gargi) సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.  గతేడాది ఒక్క కొత్త సినిమాకు కూడా సైన్‌ చేయకపోయినా సాయి పల్లవి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని